Janasena :జనసేన కార్యాలయంలో తెలంగాణ మంత్రులు.. సందడి
మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ మంత్రులు మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన ఆఫీస్ విచ్చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలంగాణ మంత్రులు మంగళగిరి వచ్చారు. వారు ప్రయాణించిన హెలికాప్టర్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని హెలిప్యాడ్లో ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తరఫున శాసనమండలి విప్ పి. హరిప్రసాద్ (Hariprasad), ఇతర జనసేన నాయకులు తెలంగాణ మంత్రులకు స్వాగతం పలికారు. అనంతరం కార్యక్రమం ముగిసిన తర్వాత , తెలంగాణ మంత్రులకు కొండపల్లి బొమ్మలతో కూడిన జ్ఞాపికలు బహూకరించి జనసేన నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు.







