Nara Lokesh: రిగెట్టి కంప్యూటింగ్ సిటిఓ డేవిడ్ రివాస్ తో మంత్రి లోకేష్ భేటీ
అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ వింగ్ ఏర్పాటుచేయండి
శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ): రిగెట్టి కంప్యూటింగ్ (Rigetti Computing) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేవిడ్ రివాస్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఏపీ రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకమైన క్వాంటమ్ వ్యాలీ త్వరలోనే ఆవిష్కృతం కాబోతోంది. అక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనా విభాగాన్ని ఏర్పాటుచేసి భాగస్వామ్యం వహించండి. ఏపీ ప్రభుత్వ డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో రిగెట్టి క్లౌడ్ క్వాంటమ్ వ్యవస్థలను అనుసంధానించడం ద్వారా ఏపీని భారత్ లో మొట్టమొదటి క్వాంటమ్ రెడీ స్టేట్ గా నిలిపేందుకు సహకారం అందించండి. ఎఆర్/ విఆర్ కంటెంట్ క్రియేషన్, ఏఐ ఆధారిత మీడియా ప్రాసెసింగ్ కోసం క్రియేటర్ ల్యాండ్ కు సహకారం అందించండి. ఆంధ్రప్రదేశ్ ను గేట్ వేగా చేసుకుని భారతదేశం, గ్లోబల్ సౌత్ మార్కెట్లకు క్వాంటం-యాజ్-ఏ సర్వీస్ (QaaS)ను అందించాలని కోరారు.
రిగెట్టి కంప్యూటింగ్ సిటిఓ డేవిడ్ రివాస్ మాట్లాడుతూ… కాలిఫోర్నియాలోని బర్క్ లీ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ ఫ్రీమాంట్ లో క్వాంటమ్ హార్డ్ వేర్ ఫ్యాబ్రికేషన్, ఆర్ అండ్ డి సెంటర్ నిర్వహిస్తోంది. రీసెర్చ్ ఇనిస్టిట్యూషన్స్, ప్రభుత్వ ఏజన్సీలకు ఎంటర్ ప్రైజింగ్ పార్టనర్లతో కలిసి క్వాంటమ్ సేవలు అందిస్తున్నాం. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అన్నారు.






