Mascow: సముద్రమార్గమే లేకుండా చేస్తాం.. కీవ్ కు పుతిన్ హెచ్చరిక..!
నల్లసముద్రంలో ఉక్రెయిన్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. అటుగా వెళ్తున్న రష్యా చమురు ట్యాంకర్లపై డ్రోన్ దాడులతో ఇబ్బందులు పెడుతోంది కీవ్. ఇటీవలి కాలంలో తమ ఆయిల్ ట్యాంకర్లపై కీవ్ డ్రోన్ దాడులు పెరగడం రష్యాను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులకు ముగింపు పలకాలంటే ఉక్రెయిన్కు సముద్రంతో సంబంధాలు లేకుండా చేయడమే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు. టెలివిజన్లో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన పుతిన్, ఈ పైరసీ దాడులను అరికట్టడానికి కఠిన చర్యలు తప్పవని ఉక్రెయిన్ను హెచ్చరించారు.
ఉక్రెయిన్ నౌకలపై దాడులను మరింత ఉద్ధృతం చేస్తామని, కీవ్కు సాయం చేస్తున్న దేశాల ట్యాంకర్లపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పుతిన్. ఇప్పటికే రష్యా సేనలు ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలను ఆక్రమించుకున్నప్పటికీ, ఒడెస్సా వంటి కీలకమైన పోర్టులు ఇంకా కీవ్ నియంత్రణలోనే ఉన్నాయి.
తుర్కియే తీరంలో రష్యా జెండాతో వెళ్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్పై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో 13 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. గత శనివారం కూడా రెండు రష్యన్ ట్యాంకర్లను ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకుంది. రష్యా పోర్టుల నుంచి చమురు రవాణా చేస్తున్న ఈ “షాడో ఫ్లీట్” నౌకల ద్వారానే యుద్ధానికి అవసరమైన నిధులు భారీగా సమకూరుతున్నాయని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పుతిన్ నుంచి ఈ తీవ్ర హెచ్చరికలు వెలువడ్డాయి.






