రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్…?
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థిత్వరేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ పై పలుకేసులు విచారణలో ఉన్నాయి. ముఖ్యంగా కేపిటల్ హిల్ కేసు, అలాగే పోర్న్ స్టార్ ఆరోపణలు, ఆర్థిక అవకతవకలకు సంబంధించి పలుకేసుల్లో ట్రంప్ నిందితుడుగా ఉన్నారు. ఉండగా.. ఇటీవల ట్రంప్పై రెండు రాష్ట్రాలు వేటు వేసిన విషయం తెలిసిందే. ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కొలరాడో, మైన్ రాష్ట్రాలు ఆయనను నిషేధించాయి. దీనిపై ఆయన అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంత జరుగుతున్నా ట్రంప్ ప్రజాదరణలో మాత్రం దూసుకుపోతున్నారు. అంటే.. ట్రంప్ పై ఆపార్టీలో తిరుగులేని నమ్మకం ఉన్నట్లు కనిపిస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విజయాన్ని అందుకున్నారు. ప్రైమరీ లో కీలకమైన అయోవా కాకసస్ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో ఇది మొదటిది. ఇందులో ట్రంప్ అత్యధిక మెజార్టీ సాధించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్నకు 51 శాతం ఓట్లు రాగా.. 21.2 శాతం ఓట్లతో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ రెండో స్థానంలో నిలిచారు. 19.1శాతం ఓట్లతో ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ మూడో స్థానం దక్కించుకున్నారు. ఇక, రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి నేత వివేక్ రామస్వామి ప్రైమరీ తొలి పోరులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు.
ఈ ఎన్నికల్లో ఆయనకు కేవలం 7.7శాతం ఓట్లు వచ్చాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు కొన్ని నెలల పాటు ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అయోవా కాకసస్తో ఈ ప్రక్రియ మొదలైంది. జనవరి 23న న్యూ హాంప్షైర్లో ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడి నుంచి పలు రాష్ట్రాల్లో ఈ పోలింగ్ నిర్వహించి అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకొంటారు. తొలి పోలింగ్లో ట్రంప్ ఘన విజయంతో.. రిపబ్లికన్ పార్టీపై ఆయన ఏ మాత్రం పట్టు కోల్పోలేదని స్పష్టమవుతోంది. కాగా.. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్ పోటీ పడుతుండటం వరుసగా ఇది మూడోసారి. 2016లో అధ్యక్ష పదవి చేపట్టిన ఆయన.. 2020లో డెమోక్రటిక్ నేత జో బైడెన్ చేతిలో ఓటమిపాలయ్యారు. తాజా ప్రైమరీ పోరులో మరోసారి ట్రంప్ గెలిచి.. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ పడతారనే అంచనాలు వెలువడుతున్నాయి.






