Taiwan: డ్రాగన్ తో అమీతుమీకి సిద్ధమవుతున్న తైవాన్..!
వన్ చైనా ప్రిన్సిపల్ నినాదంతో దూకుడు ప్రదర్శిస్తున్న డ్రాగన్ కు.. తైవాన్ తన సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమవుతోంది. చైనా నుంచి ముప్పు తీవ్రమవుతుండడంతో.. తన రక్షణ సామర్థ్యం బలోపేతం చేసుకోవడంపై ఫోకస్ పెంచింది.రాబోయే ఎనిమిదేళ్లలో రక్షణ రంగం కోసం 40 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.3 లక్షల కోట్లు) భారీ బడ్జెట్ను కేటాయిస్తున్నట్లు అధ్యక్షుడు విలియం లాయ్ చింగ్-తె ప్రకటించారు. టెక్నాలజీ, ఆవిష్కరణలతో ‘అభేద్యమైన తైవాన్’ను నిర్మించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
చైనాతో విభేదాల కారణంగా గత దశాబ్ద కాలంగా డిఫెన్స్ రంగంపై తైవాన్ భారీగా ఖర్చు చేస్తోంది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి నేపథ్యంలో గత కొన్నేళ్లుగా తైవాన్ తన రక్షణ వ్యయాన్ని పెంచుతోంది. ఈ క్రమంలో, 2027 నాటికి చైనాను ఎదుర్కొనేందుకు తమ సైన్యం అత్యున్నత స్థాయి యుద్ధ సన్నద్ధతను సాధిస్తుందని లాయ్ తెలిపారు. అమెరికా అధికారులు కూడా చైనా సైనిక చర్యకు దిగే సమయం ఇదే అంటూ గతంలో అంచనా వేశారు.”ప్రజాస్వామ్య తైవాన్ను శాశ్వతంగా కాపాడగల రక్షణ సామర్థ్యాలను నెలకొల్పడమే మా అంతిమ లక్ష్యం” అని లాయ్ వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
ఈ అదనపు నిధులను అమెరికా నుంచి కొత్త ఆయుధాల కొనుగోలు, అసమాన యుద్ధ తంత్రాలను మెరుగుపరచుకోవడం, ‘టి-డోమ్’ అనే బహుళ-స్థాయి గగనతల రక్షణ వ్యవస్థ అభివృద్ధికి వెచ్చించనున్నట్లు ఆయన వివరించారు. తైవాన్ నిర్ణయాన్ని ఆ దేశంలోని అమెరికా రాయబారి రేమండ్ గ్రీన్ స్వాగతించారు. మరోవైపు, ‘బాహ్య శక్తుల’ ఒత్తిడితోనే తైవాన్ ఈ నిర్ణయాలు తీసుకుంటోందని చైనా ఆరోపించింది.
అయితే, ఈ బడ్జెట్ ప్రతిపాదనకు పార్లమెంటులో ఆమోదం లభించడం అంత సులభం కాదు. చైనాతో సత్సంబంధాలను కోరుకునే ప్రధాన ప్రతిపక్షమైన క్యుమింటాంగ్ పార్టీ, బడ్జెట్ను వ్యతిరేకిస్తోంది. ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేసేందుకు తైవాన్ వద్ద డబ్బు లేదని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో, అంతర్గత రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూనే తైవాన్ తన రక్షణ వ్యూహాన్ని ముందుకు తీసుకెళుతోంది.






