Putin: రణమా..? స్నేహమా..? యూరప్ తేల్చుకోవాలంటున్న పుతిన్
ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు వస్తోంది. ట్రంప్ శాంతి ప్రణాళిక సవరణలపై చర్చించేందుకు అమెరికా రాయబారులు మాస్కో చేరుకున్నారు. ఈ దశలో రష్యా అధ్యక్షుడు పుతిన్.. యూరప్ దేశాల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.”మేం యుద్ధం కోరుకోవడం లేదు. కానీ యూరప్ కనుక యుద్ధాన్ని ప్రారంభించాలని అనుకుంటే.. దానికి మేం సంసిద్ధంగా ఉన్నాం” అని పుతిన్ స్పష్టం చేశారు. యూరోపియన్ నేతలు శాంతి చర్చల్లో రష్యాకు ఆమోదయోగ్యం కాని డిమాండ్లను చేర్చి, ఉక్రెయిన్ సంక్షోభంపై శాంతి అంగీకారాన్ని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యూరేపియన్ దేశాలకు అతి తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. యూరప్ కనుక యుద్ధాన్ని ప్రారంభించాలని కోరుకుంటే.. మేం దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించడానికి.. అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ మాస్కోలో పుతిన్తో చర్చలు జరిపిన కీలక సమయంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ కామెంట్లు అంతర్జాతీయంగా కలకలం రేపాయి.
రష్యాకు యూరప్తో యుద్ధం చేసే ఉద్దేశం లేదని పుతిన్ పునరుద్ఘాటించారు. అయితే తన హెచ్చరిక యుద్ధాన్ని నిరోధించడం కోసం మాత్రమే చేసినట్లు వివరించారు. ఉక్రెయిన్తో వివాదంపై ఒక అంగీకారం కుదరకుండా యూరోపియన్ నేతలు అడ్డు తగులుతున్నారని పుతిన్ ఆరోపించారు. వారికి శాంతి ఎజెండా లేదని, వారు యుద్ధానికే మద్దతు ఇస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. యూరోపియన్లు చర్చల ముసాయిదాల్లో “రష్యాకు పూర్తిగా ఆమోదయోగ్యం కాని డిమాండ్లను” చొప్పించి, పురోగతిని అడ్డుకుంటున్నారని.. అదే సమయంలో నిందను మాస్కోపై మోపాలని చూస్తున్నారని పుతిన్ ఆరోపించారు. రష్యా డ్రోన్ చొరబాట్లు, గగనతల ఉల్లంఘనలు, విధ్వంసక చర్యల నేపథ్యంలో మాస్కో లక్ష్యాలు ఉక్రెయిన్ దాటి ఉన్నాయని యూరోపియన్ ప్రభుత్వాలు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
20 పాయింట్లతో కొత్త శాంతి ప్రణాళిక
ట్రంప్ పరిపాలన ప్రతిపాదించిన ఉక్రెయిన్ శాంతి ప్రణాళికలో సవరణలకు సంబంధించిన చర్చల కోసం అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్, సలహాదారు జేర్డ్ కుష్నర్ క్రెమ్లిన్కు వచ్చారు. ట్రంప్ ప్రారంభంలో ప్రతిపాదించిన 28 పాయింట్ల ప్రణాళిక, రష్యా ప్రయోజనాలను ప్రతిబింబిస్తున్నందుకు కైవ్, యూరోపియన్ రాజధానుల నుంచి విమర్శలు ఎదుర్కొంది. అయితే అమెరికా దీన్ని వేగంగా సవరించింది. ముఖ్యంగా అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షులు ఫ్లోరిడాలో జరిపిన చర్చల తర్వాత ఆ 28 పాయింట్ల ప్రణాళికను 20 పాయింట్లకు తగ్గించారు. ఈ సవరించిన ప్రణాళికపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ సానుకూలంగా స్పందించారు. మార్పుల అనంతరం ప్రణాళిక మెరుగ్గా ఉందని అన్నారు.
యూరప్ దేశాలను పక్కన పెట్టడంతోనే..
తొలి శాంతి ముసాయిదా తయారీలో యూరప్ దేశాలను వాషింగ్టన్ పక్కన పెట్టడం పట్ల వారు అసంతృప్తితో ఉన్నారు. ఏదేమైనా యూరోపియన్ భాగస్వాములు అన్ని నిర్ణయాలలో పాలుపంచుకునేలా కృషి చేస్తున్నామని ఉక్రెయిన్ దౌత్యవేత్తలు తెలిపారు.






