Parliament: మోడీతో ఢీ అంటున్న కాంగ్రెస్.. దద్దరిల్లిన పార్లమెంటు..!
పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజు సభలో రాజకీయ సంగ్రామం చోటు చేసుకుంది.
అధికార -విపక్షాలు ఢీ అంటే ఢీ అంటూ మాటలతో తలపడ్డాయి. బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందిస్తూ.. విపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు. విపక్షాలు బీహార్ ఓటమితో నిరాశలో ఉన్నాయి.. బీహార్ వైఫల్యానికి పార్లమెంట్ వేదికగా మార్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. విపక్ష పార్టీల నేతల డ్రామాలను దేశ ప్రజలు నమ్మడం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఆయన విపక్ష ఎంపీల ఆందోళనలతో సభ పదేపదే వాయిదా పడింది. దీంతో సబాపతి తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు ఎంపీలను నినాదాలు, ఆందోళనలు చేయడానికి పార్లమెంట్ కి పంపలేదన్నారు. అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రశ్నోత్తరాల సమయంలో కొనసాగించేందుకు సహకరించాలని విపక్ష ఎంపీలను స్పీకర్ కోరారు.
ఇక, ప్రధాని మోడీ వ్యాఖ్యలపై వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు ప్రస్తావించడం డ్రామానా? పార్లమెంట్ ప్రజల కోసం ఉన్నది.. కీలకమైన అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి అని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో చర్చలు జరగకుండా డ్రామాలు ఆడేది కేంద్ర సర్కార్ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
మరోవైపు.. తొలిరోజే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీరుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై చర్చ జరపకుండా, ప్రధాని మరోసారి ‘నాటకానికి’ తెరలేపారని ఆయన ఘాటుగా విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని చేసిన ప్రసంగాన్ని ఉద్దేశించి ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. “గడిచిన 11 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ గౌరవాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను నిరంతరం కాలరాస్తోంది. ఇందుకు సంబంధించిన ఘటనల జాబితా చాలా పెద్దది” అని ఖర్గే ఆరోపించారు. గత వర్షాకాల సమావేశాల్లోనే దాదాపు 12 బిల్లులను హడావుడిగా ఆమోదించారని ఆయన గుర్తుచేశారు. కొన్ని బిల్లులను 15 నిమిషాల కన్నా తక్కువ సమయంలో, మరికొన్నింటిని అసలు చర్చ లేకుండానే పాస్ చేశారని విమర్శించారు. ‘రైతు వ్యతిరేక నల్ల చట్టాలు’, జీఎస్టీ, భారత పౌర భద్రతా నియమావళి వంటి వివాదాస్పద చట్టాలను పార్లమెంటులో బుల్డోజ్ చేశారని మండిపడ్డారు.
మణిపూర్ హింసాకాండపై పార్లమెంటులో చర్చకు పట్టుబట్టినప్పుడు, విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టే వరకు ప్రధాని మౌనంగానే ఉన్నారని ఖర్గే దుయ్యబట్టారు. ప్రస్తుతం జరుగుతున్న ‘ఎస్ఐఆర్’ ప్రక్రియలో పనిభారం కారణంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓ) ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఓట్ల దొంగతనం’ వంటి తీవ్రమైన అంశాలపై పార్లమెంటులో చర్చించాలని తాము పట్టుబడుతున్నామన్నారు. ఇకనైనా బీజేపీ దారి మళ్లించే నాటకాలకు స్వస్తి పలికి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలు, దేశ వనరుల దోపిడీ వంటి ప్రజా సమస్యలపై చర్చించాలని హితవు పలికారు.
ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కూడా ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. “ప్రధాని ఎప్పుడూ పార్లమెంటుకు హాజరుకారు, విపక్షాలతో చర్చించరు. కానీ, ప్రతి సమావేశానికి ముందు పార్లమెంట్ బయట నిలబడి దేశానికి గొప్ప సందేశాలు ఇస్తారు. సభ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని కోరతారు. ఇదంతా కపటత్వం కాదా?” అని ప్రశ్నించారు. పార్లమెంట్ సజావుగా నడవకపోతే దానికి పూర్తి బాధ్యత ప్రధాని మొండి వైఖరిదేనని స్పష్టం చేశారు. “అందరికంటే అతిపెద్ద నాటకాలరాయుడు ప్రధానే” అంటూ జైరాం రమేశ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.






