Delhi: ఎర్రకోట ఉగ్రదాడితో టెన్షన్ లో పాక్ సర్కార్..!
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఉగ్రదాడి ఘటన పాకిస్తాన్ (Pakistan) కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఢిల్లీ ఉగ్రవాద దాడి తర్వాత, ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్లో సైతం పేలుడు సంభవించింది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ … మరోసారి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. ఇస్లామాబాద్ దాడికి తామే బాధ్యత వహిస్తున్నామని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ప్రకటించినప్పటికీ, ఇద్దరు నాయకులు భారతదేశంపై నోరుపారేసుకుంటున్నారు.
ఢిల్లీ ఉగ్రదాడి గురించి పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “నిన్నటి వరకు ఇది గ్యాస్ సిలిండర్ పేలుడు. ఇప్పుడు దీనిని విదేశీ కుట్రగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు” అని అన్నారు. భారతదేశం ఎప్పుడూ పాకిస్తాన్ ను దోషిగా చూపించాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఆసిఫ్. ఈ సందర్భంగా భారతదేశాన్ని బెదిరించేందుకు ప్రయత్నించారు .“పాకిస్తాన్ రెండు వైపులా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది. తూర్పు-పశ్చిమ సరిహద్దులలో రెండు వైపులా పోరాడటానికి మేము సిద్ధంగా ఉన్నాము. మొదటి రౌండ్లో అల్లాహ్ మాకు సహాయం చేశాడు. రెండో రౌండ్లో కూడా ఆయన మాకు సహాయం చేస్తాడు.” అంటూ ఖవాజా హెచ్చరించారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత , భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దోషులను వదిలిపెట్టబోమని ప్రపంచానికి స్పష్టమైన సందేశం పంపారు. దీని తర్వాత, భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ను విజయవంతంగా నిర్వహించింది. ఇంతలో, ఢిల్లీ బాంబు దాడుల తర్వాత, దోషులు ఎవరైనా తప్పించుకోబోరని ప్రధానమంత్రి మోడీ భూటాన్ నుండి ప్రపంచానికి సందేశం పంపారు.
ఇలాంటి పరిస్థితిలో, భారతదేశం తదుపరి ఏమి చేయవచ్చో పాకిస్తాన్ ఇప్పటికే గ్రహించింది. ఆపరేషన్ సిందూర్ చేసిన గాయాలను పాకిస్తాన్ ఇంకా మరచిపోలేదు. కాబట్టి ఈ సంఘటన పాకిస్తాన్ నేల నుండి మళ్ళీ జరిగితే, అది ఇబ్బందుల్లో పడుతుంది. ఈ మొత్తం వాతావరణంలో, ఆపరేషన్ సిందూర్ భయంకరమైన దృశ్యాలను పాకిస్తాన్ గుర్తుంచుకుని ఉండాలి. అందుకే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు పాకిస్తాన్ నాయకులు.
అయితే, TTP ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వానికి తమ కేడర్ ఎక్కడుందో తెలియజేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో, ఒక TTP సభ్యుడు పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వాన్ని క్రూరంగా అభివర్ణించాడు. ముజాహిదీన్లపై యుద్ధం చేసే సామర్థ్యం వారికి లేదని పేర్కొన్నాడు. TTP సభ్యుడు ..పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వం పతనం దగ్గరలోనే ఉందంటూ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో, తమ TTP సభ్యులు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్నారని తెలిపారు.






