TLP Demands: హమాస్ పై ఇజ్రాయెల్ దాడుల్ని ఎందుకు ఖండించలేదు..పాక్ తీరుపై టీఎల్పీ ఆగ్రహం..

పాకిస్తాన్ (Pakistan) లోని ప్రధాన నగరాలు ఒక్కసారిగా రణరంగంలా మారాయి. ఇజ్రాయెల్ (Israel) కు వ్యతిరేకంగా తెహ్రీక్-ఏ-లబ్బైక్ పాకిస్థాన్ అనే మతవాద సంస్థ… ప్రధాన నగరాల్లో ఆందోళనలు నిర్వహించింది. యూదులు, పాలస్తీనాలో ముస్లింలను అణచివేస్తుంటే.. పాక్ సర్కార్ ఎందుకు చూస్తూ ఊరుకుంటోందని ఈ సంస్థ ప్రతినిధులు ప్రశ్నించారు. పాకిస్తాన్ లో పాలస్తీనియులకు మద్దతుగా మాట్లాడడమే నేరమైందని ఆసంస్థ ప్రతినిధులు ఆరోపించారు.
ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తెహ్రీక్-ఏ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్పీ) తలపెట్టిన భారీ ర్యాలీ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. లబ్బైక్ యా అక్సా మిలియన్ మార్చ్’ కారణంగా రాజధాని ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిరవధికంగా నిలిపివేశారు.ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా, రాజధానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను మూసివేసి దిగ్బంధించారు. నగరంలోని రెడ్ జోన్ను పూర్తిగా సీల్ చేసి, కేవలం అధికారిక పాసులు ఉన్నవారిని మాత్రమే మార్గల్లా రోడ్డు మీదుగా అనుమతిస్తున్నారు. దీంతోపాటు, పంజాబ్ ప్రావిన్స్ వ్యాప్తంగా 10 రోజుల పాటు 144 సెక్షన్ను అమలు చేశారు. దీని ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడటంపై నిషేధం విధించారు.
ఈ ర్యాలీకి ముందే లాహోర్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. టీఎల్పీ చీఫ్ సాద్ హుస్సేన్ రిజ్వీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వారి ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. దీంతో టీఎల్పీ కార్యకర్తలు రాళ్లు, ఇనుప రాడ్లతో పోలీసులపై ఎదురుదాడికి దిగారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు పోలీసులు, పదుల సంఖ్యలో ఆందోళనకారులు గాయపడినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే, తమ కార్యకర్త ఒకరు మరణించగా, 20 మందికి గాయాలయ్యాయని టీఎల్పీ వర్గాలు ఆరోపించాయి.
ప్రభుత్వ చర్యలను టీఎల్పీ తీవ్రంగా ఖండించింది. “శాంతియుతంగా తలపెట్టిన మా ర్యాలీని అడ్డుకోవడానికి ప్రభుత్వం నీచమైన చర్యలకు పాల్పడుతోంది. గాజాలో యూదులు ముస్లింలను అణచివేస్తుంటే, ఇక్కడ వారికి మద్దతిచ్చే వారు మమ్మల్ని అణచివేస్తున్నారు” అని టీఎల్పీ ప్రతినిధి ఆరోపించారు. నిర్బంధాలను ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రస్తుతం లాహోర్లోని టీఎల్పీ ప్రధాన కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పరిస్థితి అదుపు తప్పితే పారామిలటరీ దళాలైన రేంజర్లను రంగంలోకి దించాలని పంజాబ్ ప్రభుత్వం యోచిస్తోంది.