వికసిత్ భారత్ కు నీతి ఆయోగ్ బాటలు..

వికసిత్ భారత్ 2047 దిశగా దేశం అడుగులేయాలన్నారు ప్రధాని మోడీ. నీతి ఆయోగ్ సమావేశంలో దేేశాభివృద్ధికి కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా దేశంలో జలవివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో.. నదుల గ్రిడ్ ప్రతిపాదనలను తెచ్చారు.ప్రతి రాష్ట్రం వారి స్థాయిలో నదుల గ్రిడ్ను ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇచ్చారు. శనివారం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన 9వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ప్రధాని ప్రసంగించారు.
అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ప్రతి భారతీయుడూ కలలు కంటున్నాడని, ఇందులో రాష్ట్రాలు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు ప్రధాని మోడీ. రాష్ట్రాలు అభివృద్ధి చెందినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని.. సహకార సమాఖ్య విధానం ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించగలమని పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని చెప్పారు. శాంతిభద్రతలు, సుపరిపాలన, మౌలిక సదుపాయాలు దీనికి అత్యంత కీలకమని వివరించారు. దేశంలో పేదరికం నిర్మూలనకు ప్రధాని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి వికసిత్ భారత్ లక్ష్యానికి ఇదే ప్రాతిపదిక కావాలని.. దీనిని ఓ కార్యక్రమంలా కాకుండా వ్యక్తి కేంద్రంగా చేపడదామని రాష్ట్రాలను కోరారు. పేదరికాన్ని తగ్గించడం కాదు, పేదరికమే లేని దేశంగా మారేలా కృషి చేయాలన్నారు. కింది స్థాయిలో పేదరికాన్ని నిర్మూలించినపుడే దేశంలో గొప్ప పరివర్తన జరుగుతుందని వ్యాఖ్యానించారు.
వివిధ రంగాల్లో ఏర్పడిన అవకాశాలను ఉపయోగించుకుని వినూత్న విధానాలను రూపొందించాలని మోడీ .. రాష్ట్రాల సీఎంలను కోరారు. వాటిని అమలుచేసేలా కూడా చూడాలని అన్నారు. జనాభా నిర్వహణ ప్రణాళికలను రూపొందించాలన్నారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ అధికారుల సామర్థ్యాన్ని పెంచాలని, ఇందుకోసం సామర్థ్య నిర్మాణ కమిషన్తో కలిసి పనిచేయాలని రాష్ట్రాలకు నిర్దేశించారు.
పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించాలని రాష్ట్రాలను కోరిన ప్రధాని.. అవసరమైన విధానాన్ని రూపొందించాలని నీతి ఆయోగ్ను ఆదేశించారు. ఇందులో పెట్టుబడులకు అవసరమైన ప్రణాళికలు ఉండాలని నిర్దేశించారు. నీతి ఆయోగ్ రూపొందించిన ఆకాంక్షపూరిత జిల్లాల కార్యక్రమాన్ని మోదీ ప్రశంసించారు.గత పదేళ్లుగా భారత దేశం స్థిరంగా అభివృద్ది చెందుతోందని, పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని గుర్తు చేశారు.