ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లపై కర్నాటకలో నిరసనలు

కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కార్ తన మార్క్ పాలన చూపించాలని భావిస్తూ ముందుకెెళ్తోంది. అయితే ఈక్రమంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మాత్రం.. ఆ ప్రభుత్వం ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నాయి. ఎలాంటి ముందస్తు చర్చ లేకుండా రాత్రికి రాత్రే ప్రైవేటు సంస్థల్లోనూ లోకల్ రిజర్వేషన్ల ప్రకటన చేసిన సిద్ధరామయ్య… తర్వాత వచ్చిన నిరసనలతో వెనక్కు తగ్గారు. కర్నాటక సర్కార్ నిర్ణయాన్ని నాస్కామ్, సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ సహ పలు కంపెనీలు తప్పుపట్టాయి.
రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ సంస్థలు.. ఇతర ప్రైవేటు సంస్థలు కూడా.. 75 శాతం ఉద్యోగాలను కన్నడిగులకే కేటాయించాలని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఒకరిద్దరు మంత్రులతో మాత్రమే ఆయన చర్చించినట్టు సమాచారం. నిజానికి ఇలాంటి విధానపరమైన నిర్ణయా లు తీసుకునేందుకు మంత్రివర్గంతో చర్చించాల్సి ఉంది.పైగా జాతీయ పార్టీ అయిన. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఆ పార్టీ అధిష్టానంతోనూ సీఎం సిద్దరామయ్య చర్చించి ఉండాలి. కానీ, అలాంటిదేమీ లేకుండా.. సిద్దరామయ్య ఒక నోట్ ఇచ్చేసి.. దీనినే జీవోగా మార్చాలంటూ.. అదికారులను పురమాయిం చారు. దీంతో మంగళవారం రాత్రి దీనికి సంబంధించిన జీవో వచ్చింది.
అయితే.. ఈ జీవోపై ప్రైవేటు సంస్థలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం “నాస్కామ్” సంస్థ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఒక లేఖను సంధించింది. రాష్ట్ర జీడీపీలో 25 శాతం వాటాగా ఉన్న కార్పొరేట్ సంస్థను ప్రభుత్వం ఇరుకున పెడుతోందని పేర్కొంది. అంతేకాదు.. టాలెంట్ ఉన్న వారిని తామే నియమించుకుంటామని.. ఇలా 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలన్న నిబంధన అసంబద్ధమని స్పష్టం చేసింది. దీనిని వెనక్కి తీసుకునే విషయంలో ప్రభుత్వం ఆలోచించుకోవాలని సూచించింది. అంతేకాదు.. ఇదే కొనసాగిస్తామని తేల్చి చెబితే.. తమ మున్ముందు ప్రాజెక్టులను వేరే రాష్ట్రాలకు తరలించే ప్రయత్నం కూడా చేస్తామని పేర్కొంది.
మరో సంస్థ.. ఇన్ఫోసిస్ సైతం.. ఇదే ప్రకటన చేయడం గమనార్హం. స్థానికంగా 75 శాతం ఉద్యోగులను నియమించుకోవడం.. సాఫ్ట్ వేర్ రంగంలో కుదిరే పనికాదని కార్పొరేట్ సంస్థలు కుండబద్దలు కొట్టాయి. ఇదిలావుంటే.. ఈ విషయంపై ప్రతిపక్షాలు నోరు మెదిపేందుకు జంకుతున్నాయి. స్థానికంగా యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తాము సంచలన నిర్ణయం తీసుకున్నామని సీఎం సిద్దరామయ్య ప్రకటించినా.. ఆ వెంటనే ఎదురైన సంస్థల ఒత్తిడి.. విమర్శల నేపథ్యంలో ఆయన ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. మరోవైపు.. స్థానికులకు ఉపాధి కల్పించే సున్నిత వ్యవహారం కావడంతో.. బీజేపీ నాయకులు మౌనంగా ఉన్నారు.