India-Afghanistan: భారత్ – అఫ్గనిస్తాన్ బంధం మరింత బలోపేతం..!
భారత్ (India), ఆఫ్గనిస్తాన్ రెండు దేశాలకు సరిహద్దుల్లో ఓ కొరకంచులా తయారైంది పాకిస్తాన్ (Pakistan). రెండు దేశాలతోనూ గొడవలు.. పొరుగుదేశాలకు ఉగ్రవాదులను ఎగుమతి చేస్తూ.. ఆ దేశాలకు పెద్ద సమస్యలా మారింది. చెబితే వినదు.. అంతేకాదు.. ఉగ్రవాదాన్ని బూచిగా చూపి బెదిరించాలని ప్రయత్నిస్తోంది. దీంతో పాకిస్తాన్ ను పక్కన పెట్టి.. వాణిజ్య బంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్, ఆఫ్గనిస్తాన్ నిర్ణయించాయి. పాకిస్థాన్ రూపంలో ఉన్న అడ్డంకులను అధిగమించి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాణిజ్యాన్ని విస్తరించాలని ఇరు దేశాలు నిశ్చయించాయి. ఇందులో భాగంగా ఇరాన్లోని చాబహార్ పోర్టును మరింత విస్తృతంగా ఉపయోగించుకోవడంతో పాటు ఢిల్లీ, అమృత్సర్ నుంచి కాబూల్కు రెండు ప్రత్యేక కార్గో విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ప్రకటించాయి.
ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నూరుద్దీన్ అజీజీ, భారత విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ ఆనంద్ ప్రకాశ్ఈ వివరాలను వెల్లడించారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య బిలియన్ డాలర్లకు పైగా వాణిజ్యం జరుగుతుండగా, తాజా చర్యలతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. పాకిస్థాన్ ఆక్రమిత గిల్గిత్-బాల్టిస్థాన్ కారణంగా భారత్-ఆఫ్ఘన్ మధ్య నేరుగా భూమార్గం అందుబాటులో లేకపోవడంతో, సముద్ర, వాయు మార్గాలపై ఆధారపడాల్సి వస్తోంది.
రాజకీయాలను వ్యాపారంతో ముడిపెట్టవద్దని, తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు భారత వ్యాపారులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు అఫ్గనిస్తాన్ మంత్రి. మైనింగ్, వ్యవసాయం, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారికి పన్ను మినహాయింపులు, ఉచితంగా భూమి కేటాయింపు వంటి ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఆఫ్ఘన్ సిక్కు, హిందూ కమ్యూనిటీలు కూడా వాణిజ్యంలో పాలుపంచుకోవాలని కోరారు.
పాకిస్థాన్తో వాణిజ్య సంబంధాలు క్షీణిస్తుండటం, సరిహద్దుల మూసివేత వల్ల ఆఫ్ఘన్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో తాజా నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న కార్గో విమాన సర్వీసుల ద్వారా పండ్లు, ఔషధ మొక్కలు వంటివి వేగంగా రవాణా చేసేందుకు వీలవుతుంది.






