Delhi: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కమల వికాసం..
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుంధుబి మోగించింది. 12 డివిజన్లకు జరిగిన ఉపఎన్నికల్లో 7 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. మిగతా ఐదు స్థానాల్లో మూడింటిని ఆమ్ ఆద్మీ పార్టీ.. ఒకటి కాంగ్రెస్ గెలుచుకోగా.. మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. నవంబర్ 30న జరిగిన ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)లోని 12 వార్డులకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కొన్ని ప్రాంతాలలో, బీజేపీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించగా, మరికొన్ని చోట్ల, ఆప్ తన ఉనికిని చాటుకుంది. ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా కీలక స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది. బీజేపీకి చెందిన రేఖా రాణి దిచౌన్ కలాన్లో 5,637 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
సంగం విహార్లో కాంగ్రెస్ ఘన విజయం
సంగం విహార్ వార్డును కాంగ్రెస్ గెలుచుకుని అద్భుతమైన పునరాగమనం చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ చౌదరి 12,766 ఓట్లను సాధించగా, బీజేపీకి చెందిన సుభ్రజిత్ గౌతమ్ 9,138 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. చాలా కాలం తర్వాత ఈ విజయం కాంగ్రెస్కు మనోధైర్యాన్ని పెంచింది.
ఆప్ ఆధీనంలోకి దక్షిణ పూరి
దక్షిణ పూరి వార్డులో ఆమ్ ఆద్మీ పార్టీ తన బలమైన పట్టును నిలబెట్టుకుంది. ఆప్ అభ్యర్థి రామ్ స్వరూప్ కనోజియా 12,372 ఓట్లతో గెలుపొందగా, బీజేపీకి చెందిన రోహిణి 10,110 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. ఈ విజయం దక్షిణ ఢిల్లీలో ఆప్ పట్ల ప్రజల విశ్వాసానికి చిహ్నంగా భావిస్తున్నారు.
చాందినీ చౌక్, షాలిమార్ బాగ్లలో బీజేపీ
చాందినీ చౌక్ వార్డులో బీజేపీ తన పట్టును నిలుపుకుంది. బీజేపీ అభ్యర్థి సుమన్ గౌర్ గుప్తా 7,825 ఓట్లు సాధించగా, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి హర్ష్ శర్మ 6,643 ఓట్లు దక్కించుకున్నారు. చారిత్రాత్మకమైన చాందినీ చౌక్ ప్రాంతంలో ఈ విజయం బీజేపీకి రాజకీయ ప్రోత్సాహకంగా పరిగణించడం జరుగుతుంది. బీజేపీకి చెందిన మనీషా దేవి ద్వారకా బి స్థానాన్ని గెలుచుకున్నారు.
షాలిమార్ బాగ్ వార్డులో బీజేపీ మరింత విశేషంగా రాణించింది. బీజేపీకి చెందిన అనితా జైన్ 16,843 ఓట్లను సాధించారు. ఇది ఈ ఉప ఎన్నికలో సాధించిన అతిపెద్ద విజయాలలో ఒకటి. ఆప్ అభ్యర్థి బబితా రాణా 6,742 ఓట్లను పొందారు. షాలిమార్ బాగ్ విజయం రాజధాని ఉత్తర ప్రాంతాలలో బీజేపీ బలమైన పట్టును ప్రతిబింబిస్తుంది.
ఉనికిని చాటుకున్న AIFB
ఢిల్లీ రాజకీయాల్లో సాధారణంగా ఆప్, బీజేపీ మధ్య పోటీ ఉంటుంది. కానీ ఈసారి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) ఒక స్థానంలో విజయం సాధించడం ద్వారా దృష్టిని ఆకర్షించింది. ఈ ఆధిక్యం కొన్ని వార్డులలో స్థానిక సమస్యలు, ప్రాంతీయ నాయకుల బలమైన ప్రభావాన్ని చూపుతారని మరోసారి సూచిస్తుంది.






