చైనా సముద్రతీరంలో గల్వాన్ తరహా ఘటన..?
గత కొన్నేళ్లుగా దక్షిణ, తూర్పు చైనా సముద్రాలు తనవే అని వాదిస్తున్న చైనా.. ఇప్పుడు భౌతికదాడులకు పాల్పడుతోంది. మొన్నటికిమొన్న ఫిలిప్పీన్స్ బోటును ఢీకొట్టిన చైనా కోస్ట్ గార్డు.. ఇప్పుడు ఏకంగా కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో ఫిలిప్పీన్స్ దళాలపై దాడి చేశాయి. వారి పడవలను కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో ధ్వంసం చేయడానికి యత్నించాయి. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. దీనిపై ఫిలిప్పీన్స్ అధికారులు స్పందిస్తూ.. తమ నౌకాదళానికి చెందిన రెండు బోట్లు సెకండ్ థామస్ షోల్కు ఆహారం, ఇతర వస్తువులను తీసుకెళ్తుండగా చైనా దళాలు దాడి చేసినట్లు వెల్లడించారు.
బీజింగ్ దళాలు తొలుత ఫిలిప్పీన్స్ దళాలతో వాదనకు దిగి.. అనంతరం ఆ బోట్లలోకి చొరబడ్డాయి. మనీలా పడవల్లో ఉన్న బాక్సుల్లోని ఎం4 రైఫిల్స్ను వారు స్వాధీనం చేసుకొన్నారు. వీటితోపాటు అక్కడే ఉన్న నేవిగేషన్ పరికరాలను కూడా సీజ్ చేశారు. ఈ ఘటనలో ఫిలిప్పీన్స్ దళాల్లోని పలువురు గాయపడ్డారు. ఒక సైనికుడి బొటనవేలు తెగిపోయింది. ఫిలిప్పీన్స్ పడవలు ఎటూ కదలకుండా చైనా దళాల పడవలు చుట్టుముట్టాయి.
చైనా దళాలను సముద్రపు దొంగలతో పోల్చారు ఫిలిప్పీన్స్ ఆర్మీ చీఫ్ జనరల్ రోమియో బ్రవ్నెర్ జూనియర్.చైనా కోస్ట్గార్డ్ వద్ద పదునైన ఆయుధాలున్నాయి. మా సైనికులు ఒట్టిచేతులతో పోరాడారు. మా ఆయుధాలు, పరికరాలను తక్షణమే తిరిగి ఇవ్వాలి. అంతేకాదు వారు కలిగించిన నష్టానికి పరిహారం చెల్లించాలి’’ అని డిమాండ్ చేశారు. తమ దళాల సంఖ్య తక్కువగా ఉన్నా.. ధైర్యంగా చైనాపై పోరాడాయని ఆయన కొనియాడారు. యుద్ధాలను నివారించాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు.
మరోవైపు చైనా విదేశాంగశాఖ ఈ ఘర్షణపై స్పందించింది. ‘‘చైనా కోస్ట్గార్డ్ దళాలు చట్టపరమైన చర్యలు తీసుకొని.. ఫిలిప్పీన్స్ పడవలో అక్రమ ఆయుధ సరఫరాను అడ్డుకొన్నాయి. ఆ దేశ సైనికులపై ప్రత్యక్ష చర్యలు తీసుకోలేదు’’ అని పేర్కొంది. కోస్ట్గార్డ్ చట్టంలో సరికొత్త నిబంధనను డ్రాగన్ గత శనివారం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం జల సరిహద్దులను అతిక్రమించిన విదేశీయులను బీజింగ్ బలగాలు 30 నుంచి 60 రోజులపాటు నిర్బంధించే అవకాశాన్ని కల్పించింది. ఈ చట్టం కల్పించిన అధికారాలతోనే చైనా తీర రక్షక సిబ్బంది తాజాగా దాడికి తెగబడినట్లు తెలుస్తోంది.






