Karnataka: కర్నాటకం.. బ్రేక్ ఫాస్ట్ పాలిటిక్స్…!
కర్నాటక పవర్ పాలిటిక్స్ జోరుగా నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా పవర్ షేరింగ్ విషయం.. ఎంతకూ తేలడం లేదు.ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ల వేడుక జరుపుకుంది. అప్పటినుంచే పవర్ షేరింగ్ పంచాయితీ మొదలైంది. మిగతా రెండున్నరేళ్లు డీకే.శివకుమార్ను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఆయన వర్గం ఎమ్మెల్యేలు హస్తినలో హైకమాండ్ దగ్గర డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీంతో కొద్దిరోజులుగా సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య పవర్ షేరింగ్ రగడ నడుస్తోంది.
దీన్ని తేల్చేందుకు హైకమాండ్ రంగంలోకిదిగింది. అయితే అక్కడ ఏం తేలిందో తెలియదు.. కానీ ఆ తర్వాతే బ్రేక్ ఫాస్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. గత శనివారం డీకే.శివకుమార్ను సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్కు ఆహ్వానించారు. అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. అంతా మీడియా సృష్టేనని పేర్కొన్నారు. తాజాగా డీకే.శివకుమార్ కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బ్రేక్ఫాస్ట్కు ఆహ్వానించారు. మంగళవారం ఉదయం డీకే ఇంటికి అల్పాహారం కోసం సిద్ధరామయ్య వెళ్లనున్నారు.
బ్రేక్ఫాస్ట్లతో ఈ వ్యవహారం సాగిపోతుందా? లేదంటే ఇంకేమైనా జరగబోతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. డీకే.శివకుమార్ను ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని ఆయన వర్గం పట్టుబడుతోంది… 2028 లో మళ్లీ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే డీకే.శివకుమార్ను సీఎం కావాల్సిందేనంటున్నారు. మరి ఈ పంచాయతీ ఎలా తేలుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.






