మరిన్ని చిక్కుల్లో సెబీ చీఫ్ మాధబిపురీ….

సెబీచీఫ్ మాధబి పురీపై వరుసగా ఒక్కో ఆరోపణ చేసుకుంటూ వస్తోంది విపక్ష కాంగ్రెస్. మొన్నటివరకూ ఆదానీ విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు ఉండడంతో… ఆ కంపెనీపై సరిగ్గా వ్యవహరించలేదని ఆరోపణలు గుప్పించింది. ఇప్పుడు… మరో కీలక అంశాన్ని ప్రస్తావించింది.సెబీ ఛైర్పర్సన్గా ఉంటూ.. ఆమె ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వేతనం తీసుకుంటున్నారంటూ ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత పవన్ ఖేడా .. తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాలకిందకే వస్తుందంటూ వ్యాఖ్యానించారు.
ప్రజా సేవల్లో నైతికత, జవాబుదారీతనాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. ఒక కంపెనీలో పనిచేస్తూ ఒకచోట మాత్రమే వేతనం తీసుకోవాల్సి ఉంటుందని పవన్ అన్నారు. అలాంటిది సెబీ చీఫ్ విషయంలో అలా జరగడం లేదన్నారు. సెబీ పూర్తికాల సభ్యురాలిగా ఉన్న మాధబి ఐసీఐసీఐ బ్యాంక్, ప్రుడెన్షియల్ నుంచి వేతనం అందుకుంటున్నారని ఆరోపించారు. 2017-2024 మధ్య ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు కూడా అందుకున్నారని వివరించారు.
ఒక అత్యున్నత నియంత్రణ సంస్థను నడిపిస్తున్న వ్యక్తులు ఇలా వేతనం అందుకోవడం సెబీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. 2017 నుంచి సెబీ సభ్యురాలిగా ఉన్న బుచ్.. 2022లో ఛైర్పర్సన్ అయ్యారని పవన్ వెల్లడించారు. గత ఏడేళ్ల కాలంలో ఆమె సుమారు రూ.16 కోట్లకు పైగా వేతనం అందుకున్నారని ఆరోపించారు. సెబీ చీఫ్గా ఉంటూ ఐసీఐసీఐ నుంచి వేతనం ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై బయట వ్యక్తుల ప్రభావం పడకుండా పారదర్శకంగా విచారణ జరిపించాలని కోరారు. వేతనం అందుతుండడం వల్లే ఐసీఐసీఐ బ్యాంక్పై పలు విచారణలు నిలిచిపోయాయని ఆరోపించారు.
సెబీ చీఫ్ నియామకంలో కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీలో కీలక వ్యక్తులైన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను పవన్ ఖేడా తప్పుబట్టారు. నిబంధనల ప్రకారం కూడా.. ఓ సంస్థలో పనిచేసే వ్యక్తులు .. వేరే సంస్థ నుంచి ప్రయోజనాలు పొందకూడదు. మరి ఇదే నిజమైతే.. సెబీ చైర్ పర్సన్ పై కేంద్రం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సెబీ చైర్ పర్సన్, కేంద్రం ఎలా స్పందిస్తాయన్నది వేచి చూడాలి.