ఉక్రెయిన్ యుద్ధక్షేత్రంలోకి అమెరికా మిలటరీ కాంట్రాక్టర్లు..
ఉక్రెయిన్ యుద్ధం రెండున్నరేళ్లుగా సాగుతూనే ఉంది. రష్యా, ఉక్రెయిన్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. వేలాది మందిప్రజలు సర్వం కోల్పోయి, సొంతవారిని కోల్పోయి శరణార్థి జీవితాలు గడుపుతున్నారు. అయితే యుద్ధంలో పరోక్షంగా ఉక్రెయిన్ కు సాయం చేస్తున్న అమెరికా .. తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. కీవ్కు మద్దతుగా అమెరికా మిలటరీ కాంట్రాక్టర్లను తరలించేందుకు బైడెన్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా సన్నాహాలు చేస్తోంది. దీంతో ఇప్పటివరకు అమల్లో ఉన్న అప్రకటిత నిషేధాన్ని తొలగించనున్నట్లు సీఎన్ఎన్ కథనం వెల్లడించింది. ఉక్రెయిన్ పాలసీకి సంబంధించి అమెరికా ప్రభుత్వం తీసుకొన్న అత్యంత కీలక నిర్ణయాల్లో ఇది కూడా ఒకటిగా నిలవనుంది. రష్యా సైన్యంపై కీవ్ ఆధిపత్యం సాధించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తోంది.
ఈ ప్రతిపాదనకు ఒక్కసారి ఆమోదముద్ర పడితే.. ఈ ఏడాదే అమల్లోకి రావచ్చు. దీంతో పెంటగాన్లోని పలు అమెరికా కంపెనీలు ఉక్రెయిన్ సైన్యానికి మద్దతుగా అక్కడ పని చేసేందుకు అనుమతి ఇవ్వనుంది. దెబ్బతిన్న ఉక్రెయిన్ ఆయుధ వ్యవస్థల మరమ్మతులు, నిర్వహణను వేగవంతం చేసే అవకాశం ఈ నిర్ణయంతో లభిస్తుంది. దాదాపు రెండేళ్లుగా బైడెన్ సర్కారు అమెరికా జాతీయులను, సైనికులను ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి పంపించేందుకు తటపటాయిస్తోంది. అంతేకాదు.. తమతో అమెరికా మిలటరీ నేరుగా తలపడిందన్న భావన రష్యా వారికి కలగకూడదని ఇన్నాళ్లూ వేచి చూసింది. ముఖ్యంగా విదేశాంగశాఖ కూడా ఈ విషయంలో విముఖంగానే ఉంది.
దీంతో ఇన్నాళ్లు అమెరికా ఇచ్చిన ఆయుధ వ్యవస్థలు దెబ్బతిన్న సందర్భాల్లోను వాటిని పోలాండ్, రొమానియా, లేదా సమీపంలోని ఇతర నాటో దేశాలకు తరలించాల్సి రావడంతో తీవ్ర జాప్యం చోటుచేసుకొంటోంది. ఇక అమెరికా దళాలు వీటి రిపేర్లకు ఉక్రెయిన్ సేనకు వీడియో కాల్స్ లేదా సెక్యూర్ ఫోన్ల ద్వారానే సాయం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో రష్యా దళాలు క్రమంగా ముందుకుసాగడం.. ఉక్రెయిన్కు అందాల్సిన నిధులను కాంగ్రెస్లో చాలాకాలం నిలిపేయడం వంటి సమస్యలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వ నిధులతో పనిచేసే కాంట్రాక్టర్లను అక్కడకు పంపి ఆయుధాల మరమ్మతులు చేపట్టాలని భావిస్తున్నారు. దీనికి తోడు ఈ ఏడాది చివర్లో అమెరికా ఎఫ్-16 కీవ్కు చేరనుండటంతో వాటి నిర్వహణకు కూడా ఈ సిబ్బంది ఉపయోగపడనున్నారు.
తమ ఆయుధాలతో రష్యా భూభాగంపై కీవ్ దాడులు చేయవచ్చని మే నెలలో బైడెన్ సర్కారు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత నెల రోజుల్లోనే మిలటరీ కాంట్రాక్టర్లను పంపే ప్రతిపాదనను పరిశీలించడం గమనార్హం. మరోవైపు…క్రిమియాలోని సెవాస్టొపొల్ నగరంపై ఉక్రెయిన్ జరిపిన దాడిలో అమెరికా తయారీ క్షిపణులను ఉపయోగించినట్లు నిర్ధారణ కావడంతో రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశంలోని అమెరికా రాయబారి లినే ట్రాసీకి సమన్లు జారీ చేసింది. ఉక్రెయిన్కు క్షిపణులను సరఫరా చేయడం ద్వారా యుద్ధంలో ఆ దేశం తరపున క్రియాశీల పక్షంగా వాషింగ్టన్ అవతరించిందంటూ మండిపడిరది. అందుకు తాము తప్పకుండా ప్రతిచర్యలు చేపడతామని హెచ్చరించింది.






