Bangladesh: షేక్ హసీనాకు గట్టి ఎదురుదెబ్బ .! దోషిగా తేల్చిన ఐసీటీ..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది జూలై-ఆగస్టు నెలల్లో జరిగిన ప్రజా ఉద్యమం సందర్భంగా మానవత్వ హననానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ జరిపిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) .. ఆమెపై ఆరోపణలు నిజమేనంటూ దోషిగా తేల్చింది. దాంతో ఆమెకు గరిష్ఠ శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది జులై-ఆగస్టుల్లో జరిగిన ఆందోళనల్లో 1400 మృతి చెందారని ఐసీటీ న్యాయమూర్తి వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయమని ఆమె ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు.
ఆగస్టు 5న ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని, వారిపై హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని ఆమె ఆదేశించారని మరో న్యాయమూర్తి తీర్పు(ICT verdict)లో ప్రస్తావించారు. ఈ మేరకు దర్యాప్తు నివేదికను చదివి వినిపించారు. గాయపడినవారికి వైద్యం అందించేందుకు నిరాకరించారన్నారు. ఆమె అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని పేర్కొన్నారు. తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలన్నారు. ఇక తీర్పు నేపథ్యంలో ఐసీటీ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
షూట్ ఎట్ సైట్ ఆదేశాలు..
ఈ తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్ (Bangladesh)లో ముఖ్యంగా రాజధాని నగరం ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే.. వారిని కాల్చివేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ ఆదేశాలు ఇచ్చారు.
కాగా.. విద్యార్థుల ఆందోళనలతో అనూహ్యరీతిన ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ను వీడి భారత్కు వచ్చారు. నాటినుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పలు జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తోన్న సంగతి తెలిసిందే. తీర్పుకు ముందు కూడా తన దేశాన్ని ఉద్దేశించి సందేశం విడుదల చేశారు. ఎవరూ బాధపడొద్దని అవామీ లీగ్ కార్యకర్తలను కోరారు.






