Khyber Pakhtunkhwa: ప్రభుత్వమే ఉగ్రదాడులు చేయిస్తోంది.. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ సీఎం ఆరోపణలు
కంచే చేను మేస్తున్న చందంగా తయారైంది పాకిస్తాన్ పరిస్థితి. గతంలో తమపై పాకిస్తాన్ సైన్యం దాడులు చేస్తోందని బలూచిస్తాన్ ప్రతినిధులు ఆరోపిస్తూ వచ్చారు. ఇటీవల తాలిబన్లకు మద్దతిస్తున్నారంటూ మరో సరిహద్దు రాష్ట్రంలోనూ దాడులు చేసింది పాక్. లేటెస్టుగా ఖైబర్ పఖ్తుంఖ్వా (Khyber Pakhtunkhwa) ప్రావిన్స్ ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది.. పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వంపై కీలక ఆరోపణలు చేశారు. రాజకీయ అజెండాలో భాగంగానే నకిలీ ఉగ్ర దాడులు చేయిస్తోందన్నారు.
గత నెలలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అఫ్రిది (Sohail Afridi)… పాక్ ప్రభుత్వం ఖైబర్ ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాద సంఘటనలను సృష్టిస్తోందని ఆరోపించారు. నిజమైన శాంతి ప్రయత్నాలను అడ్డుకుంటుందన్నారు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన పష్తూన్ తహాఫుజ్ మూమెంట్ (పీటీఎం) సభ్యులు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. దీన్ని అఫ్రిది తీవ్రంగా ఖండించారు. శాంతి మార్గాలను పక్కదారి పట్టించడంతో పాటు అఫ్గానిస్థాన్తో తమ ప్రావిన్స్కు మధ్య ఏర్పడిన సంబంధాలను అడ్డుకునేందుకు ఇస్లామాబాద్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నంగా దీన్ని పేర్కొన్నారు.
తమ నాయకుడు, మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్లాగానే తాను తలవంచనన్నారు. శాంతి ప్రయత్నాలకు భంగం కలిగించేవారిని ఉమ్మడి శత్రువుగా పరిగణిస్తామని హెచ్చరించారు. పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో కొనసాగుతున్న సైనిక కార్యకలాపాలను ఆయన విమర్శించారు. సాయుధ దళాలు ఉగ్రవాద ఏరివేత పేరుతో పౌరులను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారు దీన్ని ఉగ్రవాదంపై యుద్ధంగా పేర్కొంటున్నారని.. కానీ, సొంత ప్రజలనే చంపుతున్నారని మండిపడ్డారు.
ఇటీవల పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని తిరా లోయలోని పాక్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో అనేకమంది మహిళలు, చిన్నారులతో సహా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. సైనిక కార్యకలాపాలను సమర్థించుకునేందుకు ఇస్లామాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతుందని అంతర్జాతీయ నిపుణులు ఆరోపిస్తున్నారు.






