ఫోర్బ్ ఆసియా జాబితాలో … ముగ్గురు భారతీయులకు చోటు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, డీఎల్ఎఫ్ గౌరవ చైర్మన్ కేపీ సింగ్, జిరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ వంటి దిగ్గజాలు సంపదను సమాజ శ్రేయస్సు కోసం కూడా గణనీయంగా ఉపయోగిస్తున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 17వ ఆసియా దాతృత్వ హీరోల జాబితా (15 మంది)లో వారు చోటు దక్కించుకున్నారు. తాను విద్యాభ్యాసం చేసిన ఐఐటీ బాంబేకి 1999 నుంచి ఇప్పటివరకు నీలేకని రూ.400 కోట్లు విరాళంగా ఇచ్చారు. 2020లో డీఎల్ఎఫ్ చైర్మన్ హోదా నుంచి తప్పుకున్న సింగ్ (92 ఏళ్లు) కంపెనీలో నేరుగా ఉన్న వాటాలను విక్రయించగా వచ్చిన రూ.730 కోట్లను దాతృత్వ కార్యకలాపాలకు కేటాయించారు. జిరోధా కామత్ (37 ఏళ్లు ) డబ్ల్యూటీఎఫ్ ఈజ్ పేరిట వ్యాపార దిగ్గజాలతో నిర్వహించే యూట్యూబ్ పాడ్కాస్ట్ సిరీస్ ద్వారా స్వచ్ఛంద సేవా సంస్థలకు రూ.కోటి వరకు విరాళాలు అందచేస్తున్నారు.






