Messi: మెస్సీని కలిసిన షారుఖ్.. అధికారికంగా గోట్ టూర్ షురూ..
కోల్కతా: అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ అధికారికంగా ప్రారంభమైంది. సుమారు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శనివారం తెల్లవారుజామున మెస్సీ కోల్కతాకు చేరుకున్నారు. మెస్సీతో పాటు అతని ఇంటర్ మియామీ సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్ కూడా భారత్కు వచ్చారు. అర్జెంటీనా జెండాలతో వచ్చిన వందలాది మంది అభిమానులు ‘మెస్సీ మెస్సీ’ అంటూ నినాదాలు చేస్తూ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికారు. మెస్సీ బృందం కోల్కతాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసింది.
కోల్కతాలో కార్యక్రమాలు
ఉదయం లేక్టౌన్లో తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్తో కలిసి మెస్సీ వర్చువల్గా ఆవిష్కరించారు. భద్రతా కారణాల దృష్ట్యా మెస్సీ స్వయంగా అక్కడికి వెళ్లలేదు. ఆ తర్వాత సాల్ట్లేక్ స్టేడియంలో జరగబోయే కార్యక్రమంలో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీలను ఆయన కలుస్తారు.
హైదరాబాద్లో మెస్సీ సందడి
శనివారం కోల్కతాలో కార్యక్రమం పూర్తయిన వెంటనే మెస్సీ హైదరాబాద్కు బయలుదేరుతారు. ఆయన ఫలక్నుమా ప్యాలెస్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉప్పల్ స్టేడియంలో నిర్వహించనున్న ‘గోట్ కప్’ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్లో మెస్సీ ఆడతారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొని ఆడతారు.
మెస్సీ పర్యటన షెడ్యూల్
మెస్సీ మొత్తం 72 గంటల కంటే తక్కువ సమయమే భారత్లో గడపనున్నారు. ఆయన కోల్కతా, హైదరాబాద్తో పాటు ముంబయి, ఢిల్లీలలో కూడా పర్యటిస్తారు. మెస్సీ డిసెంబర్ 14న ముంబయిలో, 15న ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొని, సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడంతో ఈ పర్యటన ముగుస్తుంది.






