ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్.. అయోధ్య నగరానికి

ఉత్తరప్రదేశ్లోని అయోధ్య లో రామమందిరం ప్రారంభోత్సవం వేళ ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్య నగరానికి విమాన సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే ఈ నెల 30వ తేదీన ఢిల్లీ నుంచి అయోధ్యకు తొలి విమానం నడపనున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత జనవరి 16 నుంచి ఈ మార్గంలో ప్రయాణికులకు రోజువారీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఐఎక్స్ 2789 విమానం డిసెంబర్ 30న ఉదయం 11 గంటలకు ఢిల్లీలో బయల్దేరి మధ్యాహ్నం 12:20 గంటలకు అయోధ్యలోని మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుందని ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తెలిపింది. ఇక అదేరోజు మధ్యాహ్నం 12:50 గంటలకు ఐఎక్స్ 1769 విమానం అయోధ్యలో బయల్దేరి మధ్యాహ్నం 2:10 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని వివరించింది.