France: అందరూ చూస్తుండగానే, చిటికెలో మ్యూజియం దోచేశారు.. పింక్ పాంథర్స్ ముఠాపై అనుమానాలు..!

అత్యంత భారీ భద్రత కలిగిన ఫ్రాన్స్లో ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో చోరీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గుకి చేసింది. మ్యూజియంలోకి చొరబడిన దుండగులు కేవలం నిమిషాల వ్యవధిలో విలువైన ఆభరణాలు దొంగలించి (Paris Museum Heist) పరారయ్యారు. చోరీ అయిన నగల విలువ దాదాపు రూ.895 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ దొంగతనం చేసింది ఎవరనేది ఇంతవరకూ తేలలేదు. అయితే కరుడు గట్టిన దొంగల ముఠా పింక్ పాంథర్స్ (Pink Panther Gang) పని అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ చోరీకి పాల్పడింది పింక్ పాంథర్స్ గ్యాంగ్ అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాల్లేనప్పటికీ చోరీ జరిగిన తీరు ఆ ముఠాను గుర్తుకుతెస్తోంది. వీరు గప్చుప్గా వస్తారు.ఎలాంటి తొట్రుపాటు లేకుండా పని ముగించుకొని వెళ్లిపోతారు. ‘‘మ్యూజియంలో చోరీకి పాల్పడిన వారు దొంగతనాల్లో ప్రొఫెషనల్స్గా కన్పించారు. ఇంతవరకూ వారి ఆచూకీ దొరకలేదు. పక్కా సమాచారం, ప్రణాళికతో దొంగతనానికి పాల్పడటం చూస్తుంటే పింక్ పాంథర్స్ పనే అనిపిస్తోంది’’ అని ఫ్రాన్స్ స్క్వాడ్ ౠ‘ది స్వీనీ’ మాజీ చీఫ్ బ్యారీ ఫిలిప్స్ అభిప్రాయపడ్డారు.
ఏంటీ పింక్ పాంథర్స్ గ్యాంగ్..?
ఈ దొంగల ముఠా గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ చోరీలకు పాల్పడింది. అందరూ చూస్తుండగానే దొంగతనాలు చేయడం వీరి నైజం. కేవలం ఆభరణాలు, వజ్రాలనే దోచుకుంటారు. ఇప్పటివరకు 35 దేశాల్లో దాదాపు 500 మిలియన్ డాలర్ల ఆభరణాలను ఈ గ్యాంగ్ దొంగిలించినట్లు ఆధారాలున్నాయి. కొన్ని రంగాల్లో నైపుణ్యం కలిగిన వ్యక్తులను రిక్రూట్ చేసుకుని చోరీలకు పాల్పడుతుంటారు.
1990ల్లో జరిగిన బోస్నియా యుద్ధంలో పాల్గొన్న సెర్బియన్ స్పెషల్ ఫోర్సెస్ సభ్యులు కూడా ఈ ముఠాలో ఉన్నట్లు గతంలో ఇంటర్పోల్ గుర్తించింది. మాజీ సైనికులు కావడంతో మిలిటరీ తరహా క్రమశిక్షణతో ప్లానింగ్ చేయడం ఈ గ్యాంగ్ అలవాటు. టార్గెట్ చేసే ప్రాంతంపై ముందుగానే నిఘా ఉంచుతారు. ఆ తర్వాత పథక రచన చేస్తారు. ఒకసారి చోరీ పూర్తయిన తర్వాత వెంటనే నకిలీ పాస్పోర్టులతో దేశం దాటేస్తారు. వీరికి అంతర్జాతీయంగా నెట్వర్క్ ఉంది. దొంగతనం చేసిన ఆభరణాలు, వజ్రాలను కరిగించడం లేదా వాటి ఆకృతి మార్చి మార్కెట్లో విక్రయిస్తుంటారని గత దర్యాప్తుల్లో తేలింది.
45 సెకన్లలో చోరీ..
ఓసారి ఈ పింక్ పాంథర్స్ గ్యాంగ్ దుబాయ్లోని ఓ మాల్లో చోరీకి పాల్పడింది. ఆ మాల్లోని నగల దుకాణంలోకి కార్లతో దూసుకెళ్లి చేతికందినన్ని వజ్రాలు, ఆభరణాలు తీసుకుని కేవలం 45 సెకన్లలో అక్కడి నుంచి పరారయ్యారు. జపాన్, బ్రిటన్ చరిత్రల్లోనే అతిపెద్ద నగల చోరీకి పాల్పడింది ఈ గ్యాంగే. ప్రముఖ హాలీవుడ్ చిత్రం పింక్ పాంథర్లో చూపించిన ఓ ట్రిక్లాంటిదే చేసి 2003లో లండన్లోని ఓ నగల దుకాణంలో వజ్రాలను చోరీ చేశారు. అప్పటి నుంచి ఈ గ్యాంగ్కు పింక్ పాంథర్ అని పేరొచ్చింది.