కరోనాతో మరణశిక్ష వాయిదా
అమెరికాలో కరోనా కారణంగా ఓ మరణశిక్ష అమలు వాయిదా పడింది. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో నేరస్థుడికి శిక్ష అమలు చేసే కార్యక్రమానికి రాలేకపోతున్నామని బాధిత కుటుంబం ఫెడరల్ కోర్టులో అప్పీల్ చేయటంతో శిక్ష వాయిదా పడింది. ఓక్లహామాలోని యుకాన్లో డేనియల్ లీ అనే వ్యక్తి ఆయుధ డీలర్ అయిన విలియం ముయెల్లర్ ఆయన భార్య నాన్సీ, వారి 8 ఏండ్ల కూతురు సారా పాలెల్ను 1996లో దారుణంగా చంపేశాడు. అతడికి కోర్టు మరణశిక్ష విధించింది. కొద్దిరోజుల క్రితం జిల్లా కోర్టు ఇంజెక్షన్ ద్వారా నేరస్థుడికి శిక్ష అమలు చేయాలని ఆదేశించింది. అయితే, బాధిత కుటుంబం కరోనా భయంతో శిక్ష అమలును చూడలేని పరిస్థితుల్లో ఉన్నందున శిక్షను వాయిదా వేయాలని అప్పీల్ చేసింది. దాంతో ఏడో సర్క్యూట్ అప్పీల్ న్యాయస్థానం శిక్షను వాయిదా వేసింది.






