ఏపీలో ప్రైవేటు కరోనా పరీక్షలకు నిర్ణీత రుసుము..
ఇకపై ప్రభుత్వం నుంచి పంపే కరోనా నమూనాలు, ప్రైవేటుగా సేకరించే నమూనాల పరీక్షలకు ఏపీ ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేయడంతోపాటు ఐసీఎంఆర్ అనుమతించిన ప్రైవేటు ల్యాబ్లలో కొవిడ్ పరీక్షలకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్లలో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలకు రూ. 750 కంటే ఎక్కువ వసూలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ ద్వారా చేసే పరీక్షకు రూ. 2800 ధరను నిర్ణయించింది. ఈ మొత్తంలోనే ర్యాపిడ్ కిట్తోపాటు పీపీఈ కిట్లు ఉంటాయని తెలిపింది. మానవవనరుల వ్యయం కూడా ఈ ధరలోనే ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్లు ఆరోగ్యశ్రీ ట్రస్టు ఈసీవోకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.






