కరోనాతో ప్రతి 15 సెకన్లకు ఒకరు మృతి
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నది. భారత్తో పాటు ప్రపంచదేశాల్లో కరోనా ఉదృతి కొనసాగుతున్నది. యూరప్, అమెరికాతో పాటు పలు దేశాల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,87,06,109 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7,04,396 మంది కరోనా బారిన పడి మరణించారు. బుధవారంతో కరోనా మరణాల సంఖ్య 7 లక్షల మార్క్ దాటింది. అమెరికా, బ్రెజిల్, భారత్, మెక్సికో దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.
గత రెండు వారాల డేటా ఆధారంగా కొవిడ్ 19 వల్ల ప్రతి 24 గంటలకు సగటున 5,900 మంది చనిపోతున్నారు. అంటే ప్రతి గంటలకు 247 మంది లేదా ప్రతి 15 సెకన్లకు ఒక వ్యక్తి కరోనాతో మృతి చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా (1,60,290), బ్రెజిల్ (96,096), మెక్సికో (48,869), బ్రిటన్ (46,299), భారత్ (39,820) దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి.






