Washington: నమో అమెరికా టూర్…
రెండురోజుల పర్యటన కోసం అమెరికా చేరుకున్న ప్రధాని మోడీకీ.. అక్కడి భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు. మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు. చల్లని వాతావరణం ఉన్నప్పటికీ.. వాషింగ్టన్ డీసీలో భారతీయ ప్రవాసులు నాకు ప్రత్యేక స్వాగతం పలికారు. వారికి నా కృతజ్ఞతలు’ అని మోడీ పోస్టు చేశారు. భారత్- అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త అధ్యయనం మొదలైందని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా మోడీ..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), కాంగ్రెస్ చట్టసభ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులతో భేటీ కానున్నట్లు వెల్లడించింది.
మరోవైపు… అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard)తో మోడీ భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలపై ఆమెతో చర్చలు జరిపినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు మోడీ. అమెరికా పర్యటనలో భాగంగా మోడీ… ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. స్టార్లింక్ సేవలపై ఆయనతో చర్చించే అవకాశం ఉందని సమాచారం.
సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, రక్షణ, ఇంధన సరఫరా రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని సుదృఢం చేయడానికి తన పర్యటన ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు మోడీ. ‘భారత్, అమెరికా తమ ప్రజల మేలు కోసం, పరస్పర ప్రయోజనం కోసం కలిసి పనిచేయడం ద్వారా ప్రపంచానికి మెరుగైన భవితవ్యాన్ని అందించనున్నాయి’ అని ఆయన తెలిపారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇరువురు నేతలు తొలిసారి భేటీ కానున్నారు.
ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్యం, సుంకాల రాయితీ, అక్రమ వలసదారులు తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనికి ముందు ఫ్రాన్స్లో పర్యటించిన మోదీ.. ఏఐ యాక్షన్ సమ్మిట్కు ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్తో కలిసి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలతో పాటు పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైనా విస్తృతంగా చర్చలు జరిపారు.







