Detroit: డా. వేములపల్లి రాఘవేంద్ర చౌదరికి ఎస్ఎమ్యూ ఘన సత్కారం
హెన్రీ ఫోర్డ్ హెల్త్ విశిష్ట సేవా పురస్కారం అందుకున్న ప్రముఖ ప్రవాసాంధ్ర వైద్యులు డా. వేములపల్లి రాఘవేంద్ర చౌదరి (Dr. Vemulapalli Raghavendra Chowdhury) ని సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ డెట్రాయిట్లో ఘనంగా సత్కరించింది. వైద్య రంగంతో పాటు, తెలుగు సాహిత్య రంగాలకు ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. పలువురు ప్రవాస సాహితీవేత్తలు, వైద్యులు, వ్యాపారవేత్తలు పాల్గొని ఆయన దశాబ్దాల సేవ, నాయకత్వాన్ని ప్రశంసించారు. డా.వేములపల్లి దూరదృష్టి కలిగిన విద్యావేత్త, మానవతావాది అని మాజీ పార్లమెంట్ సభ్యుడు మురళిమోహన్ అన్నారు. తమ మధ్య ఉన్న బంధం తెలుగు సాహిత్యం, విద్య పట్ల ఉన్న ప్రేమతో ముడిపడి ఉందని డా. ర్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఎస్ఎమ్యూ బోర్డు చైర్మన్ తాళ్లూరి జయశేఖర్ మాట్లాడుతూ డా.వేములపల్లి మార్గదర్శకత్వం, మేథస్సు తమ విశ్వవిద్యాలయ దిశ, నైతిక ప్రమాణాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాయని అన్నారు.
ఎస్ఎమ్యూ సీఈఓ శ్రీని సజ్జా ప్రసంగిస్తూ చౌదరి సహకారంతో తమ విద్యాలయం అంతర్జాతీయ విస్తరణ, భాగస్వామ్యాల ఏర్పాటుకు మూలస్తంభమని తెలిపారు. బోర్డు సభ్యుడు నిరంజన్ శృంగవరపు డా.వేములపల్లిని అభినందిస్తూ తెలుగు సాహిత్యాభివృద్ధికి వెలుగుదీపంలా నిలిచారని అన్నారు. అవధాని మేడసాని మోహన్ సీసపద్యం కవిత రూపంలో శుభాకాంక్షలు పంపారు. డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ సభ్యులు ఆ కవితను చదివి వినిపించారు. ఎస్ఎమ్యూ కులపతి డా. మురళి గింజుపల్లి వందన సమర్పణ చేశారు. రాఘవేంద్ర చౌదరి జీవితం వినయం, సేవ, ప్రతిభకు ప్రతీకని అన్నారు.
కార్యక్రమంలో యూనివర్శిటీ బోర్డు సభ్యులు పుట్టగుంట సురేష్, గేరా ప్రకాష్, ఆలే నవీన్, ట్రాయ్ తెలుగు సంఘ ప్రతినిధులు ఆలపాటి కృష్ణ, బేతంచెర్ల ప్రసాద్, చెంచు రెడ్డి, వెంకటేశ్ బాబు, డెట్రాయిట్ తెలుగు సంఘం అధ్యక్షుడు శుభ్రత గడ్డం, ప్రముఖ వైద్యులు డా. శ్రీనివాస్ కొడాలి, డా. సూర్య నలపతి, డా. పావని జాస్తి, డా. బాబు వద్లమూడి తదితరులు పాల్గొన్నారు.
1982లో మద్రాసు స్టాన్లీ మెడికల్ కళాశాల నుండి ఎంబీబీఎస్ డిగ్రీ అందుకున్న డా. వేములపల్లి రాఘవేంద్ర చౌదరి 1995లో డెట్రాయిట్లోని హెన్రీ ఫోర్డ్ హెల్త్లో రెసిడెన్సీ అభ్యసించేందుకు చేరారు. తనకు ఈ అభినందన సభ ఏర్పాటు చేసిన ఎస్ఎంయు బృందానికి ధన్యవాదాలు తెలిపారు. హెన్రీ ఫోర్డ్ పురస్కారం లభించడంతో తనపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు.







