Seoul: జిన్ పింగ్ తో ట్రంప్ చర్చలు సఫలం.. టారిఫ్ ల నుంచి చైనాకు ఊరట….!
చైనా-అమెరికా టారిఫ్ వార్ కు తెరపడింది. దక్షిణకొరియాలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో భేటీ విజయవంతం కావడంతో టారిఫ్ బాదుడు నుంచి చైనాకు మినహాయింపులు లభించాయి. దాదాపు రెండు గంటల పాటు అంతర్గతంగా సమావేశమైన వీరు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. జిన్పింగ్తో భేటీ అనంతరం ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనా (China)పై టారిఫ్లను 10శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
‘‘జిన్పింగ్ (Xi Jinping)తో భేటీ అద్భుతంగా జరిగింది. మా సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఫెంటనిల్ తయారీలో వాడే ముడి ఉత్పత్తుల రవాణాను కట్టడి చేసేందుకు జిన్పింగ్ తీవ్రంగా శ్రమిస్తారని నేను విశ్వసిస్తున్నా. అందుకే ఫెంటనిల్ పేరుతో చైనాపై విధించిన 20శాతం సుంకాలను 10శాతానికి తగ్గిస్తున్నా. దీంతో బీజింగ్పై మొత్తం టారిఫ్లు 57శాతం నుంచి 47శాతానికి దిగి రానున్నాయి. ఇక, అమెరికా సోయాబీన్ ఉత్పత్తుల కొనుగోళ్లను చైనా తక్షణమే పునరుద్ధరించేందుకు అంగీకారం కుదిరింది’’ అని ట్రంప్ (Donald Trump) వెల్లడించారు.
రేర్ ఎర్త్పై కుదిరిన డీల్..
అరుదైన ఖనిజాలకు సంబంధించిన సమస్య కూడా పరిష్కారమైందని అమెరికా అధ్యక్షుడుట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు. ఇకపై చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఈ ఖనిజాలను ఏడాది పాటు అగ్రరాజ్యానికి ఎగుమతి చేసేలా ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ అరుదైన ఖనిజాల కారణంగానే ఇటీవల ట్రంప్ చైనాపై 100శాతం సుంకాల హెచ్చరికలు చేశారు.తాజా డీల్తో బీజింగ్కు ఊరట లభించినట్లయ్యింది. ఇక చైనాతో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కూడా కుదరనున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు.
ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడిపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. జిన్పింగ్ గొప్ప నేత అని, ఆయనకు 10కి 12 మార్కులు ఇస్తానని అన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో.. అమెరికాతో కలిసి పనిచేసేందుకు చైనా అంగీకరించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో తాను చైనాలో పర్యటిస్తానని వెల్లడించారు. ఆ తర్వాత వీలు చూసుకుని జిన్పింగ్ కూడా అమెరికాకు వస్తారని అన్నారు.
జిన్పింగ్తో ట్రంప్ భేటీకి దక్షిణకొరియాలోని బూసాన్ నగరంలో గల అంతర్జాతీయ ఎయిర్పోర్టు వేదికైంది. షెడ్యూల్ కారణాల వల్లే మీటింగ్ను ఇక్కడ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ట్రంప్ బుధవారమే దక్షిణకొరియా నుంచి వెళ్లిపోవాల్సింది. దానికంటే ముందు నిన్న సాయంత్రం జిన్పింగ్తో భేటీ అవ్వాలని అమెరికా అధ్యక్షుడు భావించారు. సమయాభావం కారణంగా సమావేశాన్ని గురువారం ఉదయానికి మార్చారు. చివరి నిమిషంలో నిర్ణయం తీసుకోవడంతో.. ఎయిర్పోర్టులోనే భేటీకి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం దక్షిణ కొరియా నుంచి ట్రంప్ వెళ్లిపోయారు.







