మనం కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు
– డా।। ఎమ్.ఎస్. రెడ్డి (ప్రముఖ వైరాలజి శాస్త్రవేత్త, డెన్వర్, అమెరికా)
ప్రపంచంలోని తెలుగువారు గర్వపడేలా దాదాపు 100కు పైగా అమెరికా, ఇతర దేశాల ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్న డాక్టర్ ఎం. శ్రీనివాసులు రెడ్డి నెల్లూరులో జన్మించారు. ఉన్నత విద్యతో అమెరికా వెళ్ళి దేశానికి పేరు తెస్తున్న తెలుగు ప్రముఖులలో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయనను అందరూ చీజ్ రెడ్డి గా కూడా పిలుస్తారు. ఇలా పిలవడం వెనుక ఓ కారణం ఉంది. డెయిరీ పరిశ్రమలో ఆయన చేసిన ప్రయోగాలు ఆయనకు ఈ పేరును తెచ్చిపెట్టాయి. వైరాలజీలో ఆయన పిహెచ్డి చేశారు. 2012లో నోబెల్ బహుమతికి కూడా ఆయన పేరును నామినేట్ చేశారంటే, ఆయనకు బయో టెక్నాలజీలోనూ, వైరాలజీలోనూ ఆయనకు ఉన్న అవగాహన పట్టు ఏమిటో అర్థమవుతుంది. దాదాపు 1000 కు పైగా రాసిన సైంటిఫిక్ వ్యాసాలు ఎన్నో దేశాలలోని సైంటిస్టులకు, యూనివర్సిటీ విద్యార్థులకు రీసెర్చ్ మెటీరియల్ గా ఉంది. దాదాపు 150కి పైగా ప్రయోగాలపై డా. ఎం.ఎస్. రెడ్డి పేటెంట్ తీసుకున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము అనే ప్రాథమిక సూత్రమే ఆయన పరిశోధనల్లో కనిపిస్తాయి. అమెరికాలో డెన్వర్ నగరంలో ఉన్న డా।। ఎమ్.ఎస్. రెడ్డిని కరోనా వైరస్ విషయమై ప్రశ్నించినప్పుడు ఆయన పలు విషయాలను వివరంగా చెప్పారు.
కరోనా భయపడాల్సినంత పెద్దది కాదు…
డిసెంబర్ 2019 జనవరి 2020లోనే వూహాన్లో కరోనా వైరస్ బయటపడగానే, నన్ను కొందరు కాంటాక్ట్ చేశారు. అప్పుడే నేను ఈ వైరస్ మీద ఒక ఆర్టికల్ రాశాను. తరువాత ఫిబ్రవరిలో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజాన్ వాళ్ళకోసం ఇంకో ఆర్టికల్ రాశాను. ఇప్పుడు కూడా నేను అనేక వెబినార్ లో పాల్గొంటున్నాను. నేను అందరికి చెప్పే విషయాలు ఒక్కటే. మనం భారతీయులం, ముఖ్యంగా తెలుగువారు ఈ కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు.
కరోనా అనేది చిన్న వైరస్ కణం…బాక్టిరియా కన్నా చిన్నకణం. వైరస్ కంటే బాక్టీరియా కొన్ని వేల రెట్లు పెద్దది. అంటే కరోనా వైరస్ కణం ఎంతో చిన్నదో అర్థం అవుతుంది. అవి గాలిలో తిరుగుతూ అందరి దగ్గరికి పోతుంది. శరీరం లోపలికి కూడా వెళ్ళిపోతుంది. వందలో 80 మంది దగ్గర అది చచ్చిపోతుంది. అంటే కరోనా పరీక్షలో పాజిటివ్ గా వచ్చిన వాళ్ళు, కరోనా పరీక్ష చేయించుకోకపోయినా కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళు 80 శాతం మంది ఉంటారు. మిగిలిన వారిలో దాదాపు 15 శాతం మందికి ట్రీట్మెంట్ ద్వారా లోపల ఉన్న కరోనా కణాలను చంపేస్తారు కనుక వారు మళ్ళీ మామూలు మనుష్యులవుతారు. ఇంకా మిగిలిన 5 శాతం మనుషులలో వెంటిలేటర్ వరకు వెళ్ళి కరోనా మరణాన్ని తప్పించుకున్న వాళ్ళ శాతం 2.5 అంటే కరోనా వలన చనిపోయేవారు కేవలం 2.5 శాతం మంది మాత్రమే.
అయితే కరోనా సోకిన వారు, కరోనా వలన చనిపోయిన వారిని జాగ్రత్తగా పరిశీలిస్తే వారికి అనేక ఇతర వ్యాధులు ఉండడం, ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం కారణమని తెలుస్తోంది.
అమెరికాలో నేను డెయిరీ బిజినెస్లో ఉన్నాను. అనేక డెయిరీ ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీలకు నేను అడ్వయిజర్గా ఉన్నాను. అమెరికాలో డెయిరీ ప్రొడక్టస్లో రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలు లేవు. అంటే బాక్టీరియాలో కొన్ని మంచి బాక్టీరియాలు కూడా ఉంటాయి. అమెరికాలో ప్రభుత్వ విధానం ప్రకారం బాక్టీరియా రహిత వస్తువులనే తయారు చేసి అమ్ముతారు. అవే ప్రజలు వాడతారు. అందువల్ల వారిలో ఇమ్యూనిటీ శక్తి తక్కువ.
భారతీయులకు ఇమ్యూనిటీ శక్తి బాగా ఎక్కువ ఉంటుంది. మనం ఇంట్లో పాల నుంచి పెరుగు చేసుకుతింటాం. అందులో ఇమ్యూనిటీ పెంచే బాక్టిరియా ఉంటుంది. ఇదివరకు పూర్వం రోజులలో రాత్రి పూట పాలలో అన్నం ఉంచి, ఆ పాలను తోడుపెట్టి ఉదయమే ఆ పెరుగు అన్నం పెట్టేవారు. దీనికి మించిన రోగనిరోధక శక్తిని పెంచే మందు లేదు.
భారతీయులు ముఖ్యంగా తెలుగు వారు తినే తిండిలో నిమ్మకాయ, పసుపు, లవంగం, వెల్లుల్లి, అల్లం లాంటి అనేక యాంటీబయాటిక్ పదార్థాలను వాడుతారు. అవి తినేవారిలో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వారిని కరోనా వైరస్ ఏమీ చేయలేదు.
అసలు వైరస్, బాక్టిరియా లాంటి కణాల నుంచే సృష్టి మొదలై మెల్లగా పెరుగుతూ కొన్ని వేల సంవత్సరాలకు మనిషి తయారయ్యాడని శాస్త్రజ్ఞులు చెపుతూ ఉంటారు. అందుకే వైరస్ కణం మనిషి శరీరంలోకి వెళ్ళి అక్కడ వృద్ధి చెందుతుంది. ఆ మనిషిలో రోగ నిరోధక శక్తి ఉంటే యాంటి వైరస్ కణాలు కొత్తగా వచ్చిన వైరస్ కణాలను చంపేస్తాయి.
మన ఆహారపు అలవాట్లే మనల్ని రక్షిస్తోంది. అంటే కరోనా గురించి జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ప్రతి వ్యక్తి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. అలా చేస్తే కరోనా ఉందా., పోయిందా? వ్యాక్సిన్ వచ్చిందా? రాలేదా? లాక్డౌన్ ఉంటుందా? తీసేస్తారా? లాంటి భయాందోళనలు ఉండవు.
– చెన్నూరి వెంకట సుబ్బారావు






