అమెరికా చరిత్రలోనే అత్యధికం…
ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్ మన్ సాక్స్ కు అమెరికా చరిత్రలోనే అత్యధిక జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనిని చెల్లించేందుకు సిద్ధమని గోల్డ్ మన్ సాక్స్ ప్రకటించింది. 1 యండీబీ మలేషియన్ లంచం కుంభకోణం కేసుకు సంబంధించి అమెరికా న్యాయస్థానం ఈ సంస్థకు 2.9 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఇప్పటి వరకు ఒక అవినీతి కేసులో అమెరికా న్యాయస్థానం విధించిన అత్యధిక జరిమానా ఇదే. కోర్టు విధించిన ఫైన్ చెల్లించేందుకు గోల్డ్ మన్ సాక్స్ అంగీకరించిందని యూఎస్ అసిస్టెంట్ అటార్నీ జనరల్ బ్రియాన్ సీ రాబిట్ స్వయంగా వెల్లడించారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థను గోల్డ్ మన్ సాక్స్ మోసం చేసిందని, తద్వారా కొన్ని కోట్ల రూపాయల లబ్ధిపొందిందనే ఆరోపణలు నిరూపితమయ్యాయి. ఇందుకోసం 1.6 బిలియన్ డాలర్ల లంచం ఇచ్చిందని సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. మలేషియా ప్రభుత్వ సావరిన్ వెల్త్ ఫండ్ 6.5 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించడానికి గోల్డ్ మన్ సాక్స్ సహకరించిందని, 1 ఎండీబీ ఉన్నతాధికారులు ఈ కుంభకోణంలో దాదాపు 4.5 బిలియన్ డాలర్లను కొట్టేశారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కుంభకోణం మొత్తం 2009 నుంచి 2015 మధ్య జరిగిందని అమెరికా కోర్టు నిర్ధారించింది.






