ప్రపంచ కుబేరుల్లో ఎలాన్ మాస్క్…
ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ను ఎలక్ట్రానిక్ కారు తయారీ కంపెనీ అధినేత ఎలాన్ మాస్క్ అధిగమించారు. జుకర్ బర్గ్ ను వెనక్కునెట్టి మూడవ స్థానానికి దూసుకెళ్లారు. ఎస్ అండ్ పీ 500 సూచీలో టెస్లా కంపెనీని చేర్చుతున్నట్టు వార్తలు వెలువడడంతో ఈ కంపెనీ షేర్లు సోమవారం ఒక్కరోజే ఏకంగా 15 శాతం వృద్ధి చెందాయి. మరుసటి రోజు మంగళవారం కూడా 8.2 శాతం భారీ పెరుగుదలతో ఎలాన్ మస్క్ సంపద 7.6 బిలియన్ డాలర్లు పెరిగి 109.7 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచీ పేర్కొంది. ఈ ఏడాది ఎలాన్ మస్క్ సంపద ఏకంగా 82.2 బిలియన్ డాలర్ల మేర పెరిగింది.
ప్రపంచంలో టాప్ 500 సంపన్నుల్లలో ఈ ఏడాది అత్యధికంగా లాభపడింది ఎలాన్ మాస్కే. ఇదిలావుండగా డిసెంబర్ 21న ఎస్అండ్పీ 500 సూచీలోకి టెస్లా ప్రవేశించనుంది. కాగా తనకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందని, లక్షణాలు లేవని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.






