America: అమెరికాలో ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు దుర్మరణం

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మృతి చెందారు. కుటుంబసభ్యులు కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులను తెలంగాణ (Telangana)లోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లికి చెందిన ప్రగతి రెడ్డి(Pragathi Reddy) (35), ఆమె కుమారుడు అర్విన్ (6), అత్త సునీత (Sunita) (56)గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. టేకులపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి(Former MPTC Mohan Reddy), ఆయన భార్య మాజీ సర్పంచ్ పవిత్రాదేవికి ఇద్దరు కుమారులున్నారు. రెండో కమార్తె ప్రగతి రెడ్డికి సిద్దిపేటకు సమీపంలోని బక్రి చెప్యాల చెందిన రోహిత్రెడ్డితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
రోహిత్ రెడ్డి తల్లి సునీత కూడా వారితో పాటే అమెరికాలో ఉన్నారు. ప్రగతిరెడ్డి, రోహిత్ రెడ్డి, ఇద్దరు పిల్లలు, సునీత కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రగతి రెడ్డి, పెద్దకుమారుడు అర్విన్, సునీత అక్కడికక్కడే మృతిచెందారు. రోహిత్ రెడ్డి, చిన్నకుమారుడు గాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో రోహిత్ కారు నడిపారు. ఈ ప్రమాదంతో టేకులపల్లిలో విసాధఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే ప్రగతిరెడ్డి తల్లిదండ్రులు మోహన్ రెడ్డి, పవిత్రాదేవి అమెరికాకు బయల్దేరారు. మృతులకు ఫ్లోరిడాలోనే దహన సంస్కారాలు చేస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.