Sridhar Babu: విక్టోరియా పార్లమెంట్ ను సందర్శించిన మంత్రి శ్రీధర్బాబు
మెల్బోర్న్లోని ప్రఖ్యాత మోనాష్ యూనివర్సిటీ (Monash University) ప్రతినిధులను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) ఆహ్వానించారు. ఆస్ట్రేలియా (Australia) పర్యటనలో భాగంగా ఆయన వర్సిటీని సందర్శించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, మెడికల్ డివైసెస్, సస్టైనబుల్ ఇంజనీరింగ్, క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ తదితర రంగాల్లో వినూత్న ఆవిష్కరణల కోసం తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరారు. ప్రముఖ విద్యాసంస్థలను భాగస్వామ్యం చేస్తూ జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్, ప్రాజెక్టులు, ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఎక్స్ఛేంజ్లు, కో-ఇన్నోవేషన్ ఇనిషియేటివ్స్ను చేపట్టాలన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ (AI City) , ఏఐ ఇన్నోవేషన్ హబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ క్వాంటం కంప్యూటింగ్, తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్, టీ హబ్, టీ వర్క్స్ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో వినూత్న ఆవిష్కరణలు, పరిశోధనలకు ఈ భాగస్వామ్యం మరింత ఊతమిస్తుందని శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు.
గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మారేందుకు అవసరమైన ఎకో సిస్టం కలిగిన తెలంగాణ లాంటి రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వర్సిటీ అకడమిక్ అఫైర్స్ వైస్-ప్రోవోస్ట్ ప్రొఫెసర్ మ్యాథ్యూ గిలెస్పీ వెల్లడించారు. శాసనాల తయారీలో పౌరుల భాగస్వామ్యం పెరిగినప్పుడే పారదర్శకత, జవాబుదారీతనం కూడా పెరుగుతుందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మంత్రి విక్టోరియా పార్లమెంట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణలో చట్టసభ పనితీరు, పాలనా సంస్కరణల గురించి వివరించారు.







