Pullela Gopichand: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం నాడు జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ (Pullela Gopichand) కలిశారు. జుబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన్ను కలిసిన గోపీచంద్.. స్పోర్ట్స్ పట్ల సీఎం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, ఇది నిజంగా క్రీడలకు మంచి పరిణామమని చెప్పారు. క్రీడల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హర్షణీయమన్నారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేయడం ద్వారా క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటోందని గోపీచంద్ (Pullela Gopichand) అన్నారు. ఇలా క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీలు, తీసుకుంటున్న చర్యలు క్రీడారంగానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. తెలంగాణ క్రీడాకారులను అంతర్జాతీయస్థాయిలో నిలబెట్టేందుకు తను కూడా ప్రభుత్వానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.