BRS: కవిత లేఖతో తెలంగాణలో మళ్లీ బ్లేమ్ పాలిటిక్స్…

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) .. సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడు,మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR)కు రాసిన లేఖ తెలంగాణలో మళ్లీ రాజకీయ కుంపటి రగిలించింది. మొన్నటివరకూ వినిపించిన ఫిక్సింగ్ రాజకీయాలను పార్టీలు తెరపైకి తెచ్చాయి. బీఆర్ఎస్ తో మీరు పొత్తులో ఉన్నారంటే, కాదు మీరు పొత్తులో ఉన్నారంటూ కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. అయితే అదేమీ లేదని గులాబీ నేతలు చెబుతున్నా.. అది జనంలోకి వెళ్లినట్లు కనిపించడం లేదు.
కవిత లెటర్ పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) స్పందించారు. కేటీఆర్ (KTR), హరీష్రావు (Harishrao) కలిసి కవిత పేరుతో లేఖ రాశారని, ఆ లేఖకు, కవితకు సంబంధమే లేదని అన్నారు. లెటర్ ఆలోచన ఎలా వచ్చిందో, ఎక్కడ ప్లాన్ వేశారో తనకంతా తెలుసునని, ఆర్టిఫీషియల్ (Artificial) లేఖను కూడా సరిగా రాయలేకపోయారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ (BJP)తో కలుస్తుందని, 20 లేదా 30 సీట్లలోనే బీఆర్ఎస్ పోటీ చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.
కేసీఆర్ కుటుంబంలో కలహాలు అనేది పెద్ద డ్రామా అని, వందేళ్ళయినా కేసీఆర్ కుటుంబం కలిసే ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.కవిత గురించి ఆలోచించే సమయం తనకు లేదన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడ ఉంటుందని అన్నారు. వరంగల్లో కేసీఆర్ పెట్టిన సభ తాను ఒక్కడినే పెట్టగలనని.. వాట్సాప్లో మెసేజ్ పెడితే… తన కోసం పది లక్షల మంది వస్తారని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖపై బీజేపీ నేత డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమని, ఈ కుట్రలో భాగమే కవిత లేఖ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని ఒక ముఖ్య నాయకుడు.. ఈ లేఖ వెనక ఉన్నారని ఆమె ఆరోపించారు. తండ్రికి కూతురు లేఖ రాయాల్సిన అవసరం ఏముందన్నారు. కేసీఆర్ను కలిసే పరిస్థితి కూడా కవితకు లేదా అని ప్రశ్నించారు.అసలీ లేఖ కవిత రాసిందేనా.. రాస్తే ఎలా బయటకు వచ్చింది.. ఎవరు రిలీజ్ చేసారని డీకే అరుణ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, కేసీఆర్ బలహీనపడ్డారు కనుకనే.. బీజేపీపై విమర్శల స్థాయి తగ్గించారన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీయేనని అన్నారు.
కాగా తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్ తీరుపట్ల ఎమ్మెల్సీ కవిత ధిక్కార స్వరం వినిపించారు. పార్టీ తీరుపై నేరుగా కేసీఆర్కే ప్రశ్నలు సంధించారు కవిత. తన సందేహాలను వ్యక్తం చేస్తూ గురువారం నాడు కేసీఆర్కు సంచలన లేఖ రాశారు కవిత. ఈ లేఖలో బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.