KTR: బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై పార్లమెంటులో చర్చించాలి: కేటీఆర్
రాష్ట్ర బీసీలకు కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని, ఆ పార్టీ నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR) అన్నారు. తెలంగాణ భవన్లో బీసీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కి, అడుగడుగునా బీసీలను వంచిస్తున్న ఆ పార్టీని ఎక్కడికక్కడ నిలదీస్తామని చెప్పారు. తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే అమలు చేసినట్లు చెబుతూ దేశవ్యాప్తంగా తిరుగుతున్న రాహుల్గాంధీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో ఈ అంశం చర్చకు వచ్చేలా చూడాలన్నారు. లేదా ప్రైవేట్ మెంబర్ బిల్లు సైతం ప్రవేశపెట్టవచ్చు అని చెప్పారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ (Congress) పార్టీల ఎంపీలు తమ గళమెత్తాలన్నారు.
బీసీల రిజర్వేషన్ల నుంచి నిధుల అమలు, ఓబీసీ సంక్షేమశాఖ వరకు అన్ని అంశాల్లో కేంద్రంలోని బీజేపీ (BJP) ద్రోహం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ వెన్నంటి ఉన్న కార్పొరేటర్లకు భవిష్యత్తులో మంచి పదవులు దక్కుతాయని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తమ పార్టీ అధినేత కేసీఆర్ దీక్ష చేపట్టిన నవంబరు 29వ తేదీని దీక్షాదివస్ పేరిట ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు దీక్షాదివ్సను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.






