Etela Rajender: బీజేపీ ఆఫీసుపై దాడికి కాంగ్రెస్దే బాధ్యత.. సీఎం క్షమాపణ చెప్పాలి: ఈటల రాజేందర్

ఇటీవల బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం మెప్పు కోసమే రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర పనులను ప్రోత్సహిస్తున్నారని ఈటల ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఇదంతా గమనిస్తున్నారన్న ఆయన.. తెలంగాణలో ప్రస్తుతం ప్రతి గడపలో సీఎం రేవంత్ రెడ్డిని తిట్టుకునే పరిస్థితి ఉందన్నారు. ఇంత తక్కువ సమయంలో ప్రజల్లో ఇంత వ్యతిరేకత సంపాదించిన ప్రభుత్వం ఇదేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలన తట్టుకోలేక ప్రజలు అప్పుడే నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. ఇతర పార్టీల కార్యాలయాలపై కాంగ్రెస్ వర్గాలు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, కాంగ్రెస్ శ్రేణులపై చర్యలు తీసుకోవడం లేదని ఈటల రాజేందర్ (Etela Rajender) ఆరోపించారు.
అలాగే చర్లపల్లి రైల్ టెర్మినల్ ప్రారంభోత్సవంలో వర్చువల్గా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. ఆరాంఘర్ ఫ్లైఓవర్ ఆరంభించడానికి మాత్రం స్వయంగా వెళ్లారని, అక్కడ తన పక్కన ఒవైసీ సోదరులను పెట్టుకొని వెకిలి మాటలు మాట్లాడారని ఈటల (Etela Rajender) మండిపడ్డారు. గతంలో ప్రధాని మోదీని, బీజేపీని ఇలాగే విమర్శించిన బీఆర్ఎస్ ఏమైందో గుర్తుంచుకోవాలని, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న వెకిలిచేష్టలకు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.