TTD: శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు: టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు

టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బిఆర్ నాయుడు అధ్యక్షతన, టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావుతో కలిసి మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
• ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాలు, ఆస్తుల GLOBAL EXPANSION కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆమోదం. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు నిర్ణయం.
• ముఖ్యమంత్రి సూచనల మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మించేందుకు ఆమోదం.
• స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. తద్వారా కేంద్ర ప్రభుత్వం స్విమ్స్ కు ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంది.
• కాలినడక దారులలో వచ్చే భక్తులకు మేరకుగైన వైద్య సౌకర్యం అందించేందుకు గాను అవసరమైన సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, అత్యధిక వైద్య పరికరాలు ఏర్పాటుకు ఆమోదం.
• భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఫీడ్ బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఈ మేరకు ఏపీ డిజిటల్ కార్పోరేషన్ సహకారంతో భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయం.
• తిరుమలలోని బిగ్, జనతా క్యాంటిన్ ల నిర్వహణ సరిగ్గా లేదు. మరింత నాణ్యంగా ఆహార పదార్థాలు తయారు చేసే అందించేందుకు దేశంలో ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సుల జారీలో నూతన విధానం అమలుకు ఆమోదం.
• తిరుమల అన్నప్రసాద విభాగంలో మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు అందించేందుకు SLSMPC ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాలలో 258 మంది సిబ్బందిని తీసుకునేందుకు ఆమోదం.
• కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న సాంప్రదాయ పాఠశాలకు ఎస్వీ విద్యాదాన ట్రస్టు నుండి ప్రతి సంవత్సరం రూ.2 కోట్లు ఆర్థిక సాయం చేసేందుకు ఆమోదం.
• శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆహార ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు టీటీడీలో ఫుడ్ సెఫ్టి విభాగం ఏర్పాటుతో పాటు అందుకు అనుగుణంగా సీనియర్ ఫుడ్ సేఫ్టి ఆఫీసర్ పోస్టును SLSMPC కార్పొరేషన్ ద్వారా భర్తీ చేసేందుకు ఆమోదం.
• శ్రీవారి దర్శనానికి సర్వ దర్శనం క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం ఆల్వార్ ట్యాంక్ విశ్రాంతి భవనాల నుండి బాట గంగమ్మ సర్కిల్ మధ్యలో రూ.3.36 కోట్లతో 6 టాయిలెట్ బ్లాక్స్ నిర్మించేందుకు ఆమోదం.
• ఒంటి మిట్ట కోదండ రామాలయంలో విమాన గోపురానికి రూ.43 లక్షలతో బంగారు కలశం ఏర్పాటు చేయాలని నిర్ణయం.
• ముంబైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి స్థానిక సిడ్కో కేటాయించిన 3.60 ఎకరాల స్థలానికి నిర్ణయించిన రూ.20కోట్లకు పైగా ఉన్న లీజు ధరను తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం.
ఈ సమావేశంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవోలు శ్రీమతి గౌతమి, వీరబ్రహ్మం పాల్గొన్నారు.