Modi: సత్యసాయి సేవా మార్గం స్ఫూర్తిదాయకం…నరేంద్రమోదీ
పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి శతజయంతి ఉత్సవాలు
పుట్టపర్తిలోని ప్రశాంత నిలయంలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ (Modi) ప్రశాంత నిలయానికి చేరుకుని సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో పాటు సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సభికులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు.
సత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భౌతికంగా బాబా లేకున్నా… ఆయన ప్రేమ మనతోనే ఉంది. సత్యసాయి బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తోంది. కోట్ల మంది ఆయన భక్తులు మానవ సేవ చేస్తున్నారు. సత్యసాయి ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింపజేశాయి. బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి. ‘అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు’.. ఇదే ఆయన నినాదం. చాలా మంది జీవితాలను సత్యసాయి సమూలంగా మార్చేశారు. లక్షల మందిని సేవామార్గంలో నడిపించారు. ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించారు.
బాబా జీవితం.. వసుధైక కుటుంబం అన్న భావనతో సాగింది. సత్యసాయి బాబా ఎంతో మందికి సేవ చేశారు. పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి. బాబా బోధనలు చాలా మంది జీవితాలను మార్చేశాయి. ఎన్నో కోట్ల మందికి బాబా మార్గదర్శనం చేశారు. భక్తి, జ్ఞానం, కర్మ అనేవి సేవతోనే ముడిపడి ఉంటాయి. కోట్లాది మంది బాబా భక్తులు మానవ సేవ చేస్తున్నారు. సత్యసాయి భక్తులను ఎంతో ప్రేమతో చూసుకునేవారు. గతంలో రాయలసీమలో తాగునీటి కష్టాలు ఉండేవి. సత్యసాయి ట్రస్ట్ ద్వారా పేదలకు సురక్షిత నీరు అందించారు. ప్రేమ, సేవకు సత్యసాయి ప్రతిరూపంగా నిలిచారు. సేవే మరమావధిగా బాబా భావించారు. మానవసేవే.. మాధవసేవ అని బాబా భావించారు అని చెప్పుకొచ్చారు.
పుట్టపర్తి పవిత్ర భూమిలో ఏదో మహత్తు ఉంది. సత్యసాయి సంస్థలన్నీ ఇలాగే ప్రేమను పంచుతూ ముందుకువెళ్ళాలి అని మోదీ అన్నారు. ప్రేమ, శాంతితో కూడిన వసుదైక కుటుంబ భావన సత్యసాయిదని తెలిపారు. విశ్వశాంతి, విశ్వసేవను బాబా మనకు చాటి చెప్పారని అన్నారు. మానవ జీవితంలో సేవ చాలా ముఖ్యమని సత్యసాయి చెప్పారని గుర్తుచేశారు. అందరినీ ప్రేమించాలి.. అందరికీ సేవ చేయాలి.. ఇదే బాబా నినాదమని వివరించారు. గుజరాత్ భూకంపం వచ్చినప్పుడు బాబా సేవాదళ్ సేవలందించిందని గుర్తుచేశారు. పేదలకు ఎప్పుడు ఆపద వచ్చినా.. బాబా సేవాదళ్ ఆదుకుంటుందని ప్రశంసించారు. తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలందించారనిపేర్కొన్నారు.
సర్వమానవ సంక్షేమమే సత్యసాయి బాబా మార్గం… సీఎం చంద్రబాబు
విశ్వశాంతి, సర్వమానవ సంక్షేమమే సత్యసాయి బాబా మార్గమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భూమిపై మనకు తెలిసిన.. మనం చూసిన దైవస్వరూపం ఆయనని కొనియాడారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో చంద్రబాబు మాట్లాడారు. ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్, పలువురుమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘మానవసేవే మాధవసేవ అని సత్యసాయి నమ్మి ఆచరించారు. ప్రపంచమంతా ప్రేమను పంచారు. విదేశాలకు వెళ్తే చాలా మంది ఆయన గురించి చెప్పేవారు. 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించారు. 102 విద్యాలయాలు నెలకొల్పారు. ఎన్నో వైద్యాలయాలు స్థాపించారు. 140 దేశాల్లో 200 కేంద్రాల్లో సత్యసాయి ట్రస్ట్ సేవలందిస్తోంది. ట్రస్ట్కు 7లక్షల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు. ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలి. సత్యసాయి చూపిన మార్గంలో ముందుకెళ్లాలి’’ అని చంద్రబాబు అన్నారు.
సత్యసాయిబాబా సేవలు అనుసరణీయం…ఐశ్వర్యరాయ్
పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో సినీ నటి ఐశ్వర్యారాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ప్రజలకు సత్యసాయి చేసిన సేవలను గుర్తుచేశారు. సత్యసాయి జన్మించి వందేళ్లు గడిచిపోయింది. ఆయన మనతో లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. ఆయన నేర్పిన పాఠాలు, మార్గదర్శకత్వం, ఆచరించిన విధానాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. నిజమైన నాయకత్వం అంటే భగవంతుడికి, ప్రజలకు సేవ చేయడం అని బాబా చెప్పేవారు. సత్యసాయి ఛారిటీ ద్వారా ఏటా వేల మంది విద్యార్థులకు ఉచితంగా విద్య అందుతోంది. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్నారు’’ అని నటి ఐశ్వర్యారాయ్ తెలిపారు.
నాకు పుస్తకాన్ని ఇవ్వడం మరచిపోలేని అనుభూతి…సచిన్ టెండూల్కర్
పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హాజరై మాట్లాడారు. సత్యసాయి బాబాతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సత్యసాయి తనకి ఓ పుస్తకం పంపారని.. అది జీవితంలో గోల్డెన్ మూమెంట్ అని చెప్పుకొచ్చారు. ‘ప్రజలను జడ్జ్ చేయొద్దు.. వారిని అర్థం చేసుకోవాలి అని సత్యాసాయి నాకు చెప్పారు. దీని వల్ల చాలా సమస్యలు మన దరికి రావని సూచించారు. 2011 ప్రపంచ కప్లో నేను ఆడుతున్నప్పుడు నా మది నిండా ఎన్నో భావోద్వేగాలు ఉండేవి. ఎందుకంటే అదే నా చివరి వరల్డ్ కప్. అప్పుడు నేను బెంగళూరులో ఉన్నా. ఆ సమయంలో బాబా పంపిన ఓ పుస్తకం నా దగ్గరికి వచ్చింది. ఆ వెంటనే నా ముఖంలో తెలియని ఆనందం. నా జీవితంలో అదే నాకు గోల్డెన్ మూమెంట్ అనిపించింది’ అని సచిన్ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ‘బాబా పంపిన పుస్తకం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ప్రాక్టీస్ నుంచి మ్యాచ్లు ఆడే వరకు.. ఆ పుస్తకమే నా తోడుంది. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే. ముంబైలో శ్రీలంకపై ఘన విజయం సాధించాం. సుదీర్ఘ నిరీక్షణకు తెరదింపుతూ ప్రపంచ కప్ను సగర్వంగా ముద్దాడాం. దేశమంతా ఆనందంలో మునిగిపోయింది. నా ఇన్నేళ్ల క్రికెట్ కెరీర్లో అదే గొప్పగా అనిపించింది. దీనికి కారణం బాబా ఆశీస్సులు, గురువుల దీవెనలే. భగవాన్ సత్యసాయి బాబా అనుగ్రహమే దీనికి ముఖ్య కారణం’ అని సచిన్ వెల్లడించారు.
ఆధ్యాత్మిక శక్తి: పవన్కల్యాణ్
ప్రపంచానికి వెలుగులిచ్చే అరుదైన, ఆధ్యాత్మిక శక్తి సత్యసాయి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ అన్నారు. అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఆయన పుట్టడం ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. విదేశాల్లో చాలా మంది సత్యసాయి భక్తులను చూశానన్నారు. ‘‘సామాన్యుడికి తాగునీరు అందివ్వాలని సత్యసాయి ఆలోచించారు. జల్జీవన్ మిషన్ తరహాలో ఏర్పాట్లు చేశారు. అలాంటి సేవా తత్పరత ఆయనది. సచిన్ తెందూల్కర్తో పాటు ఎంతో మంది ప్రముఖులను ఆయన ప్రభావితం చేశారు. వారిలో ఐఏఎస్లు కూడా ఉన్నారు. సత్యసాయి స్ఫూర్తిని కొనసాగిస్తాం’’ అని పవన్ తెలిపారు.
ప్రేమతో ప్రపంచాన్ని గెలిచారు: లోకేశ్
పేదలకు ప్రేమతో సాయమందించాలని సత్యసాయి చెప్పిన మాటలే తనకు స్ఫూర్తి అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రేమతో ప్రపంచాన్ని ఆయన గెలిచారని.. సేవతో ప్రజలకు దేవుడయ్యారని కొనియాడారు. మనుషుల్లో ప్రేమ ఉన్నంత వరకు సత్యసాయి బాబా మన మధ్యే ఉంటారన్నారు. ఇక్కడకు వచ్చినపుడల్లా బంగారూ అని బాబా పిలచినట్లుగా అనిపిస్తుందని సత్యసాయి బాబాను స్మరించుకున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపిన బాటలో మనమంతా నడవాలన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో సత్యసాయి ట్రస్ట్ విద్య, వైద్య సేవలు అందిస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సత్యసాయి బోధనలను అందరం ఆచరించాలన్నారు. ప్రశాంతి నిలయం ప్రశాంతతకు ఆలయమని లోకేశ్ అన్నారు.
నాణెం, తపాలాబిళ్ళల ఆవిష్కరణ
పుట్టపర్తిలోని ప్రశాంత నిలయంలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశాంత నిలయానికి చేరుకుని సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో పాటు సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సత్య సాయి బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ఆవిష్కరించారు.






