ఏపీ కోసం రంగంలోకి దిగుతున్న ఆర్మీ…!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరగడమే కాకుండా ఆక్సీజన్ కొరత కూడా తీవ్ర స్థాయిలో ఉన్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. కోవిడ్- ఆక్సిజన్ మేనేజ్మెంట్పై తాజాగా కీలక సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు, ఉత్పత్తి, సరఫరా పై తూర్పు నావికాదళం ఈఎన్సీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎండీతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. సిఎం జగన్ ఆదేశాల మేరకు ఆక్సిజన్ సరఫరా, నిల్వలు, నిర్వహణపై స్టీల్ ప్లాంట్ సీఎండీ, తూర్పు నావికాదళం ఈఎన్సీతో రాష్ట్ర ప్రభుత్వ కీలక అధికారులు చర్చలు జరిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు… తమకు ఏం కావాలి ఏంటీ అనేది వివరించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు నిర్వహణను తూర్పు నావికాదళం చేపడుతుంది. ఆక్సిజన్ ప్లాంట్లు లీకేజీలు, స్ధితిగతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకొచ్చిన తూర్పు నావికాదళం… దీనికోసం అత్యవసరంగా నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఒక్కో బృందం మూడు నుంచి నాలుగు జిల్లాల్లో నిర్వహణ బాధ్యతలు ఇస్తారు. ఎక్కడ అవసరమైతే అక్కడకి ఈ బృందాలను వాయుమార్గంలో తరలించడానికి ఏర్పాటు చేస్తారు. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయాలు, ఇతర ఇబ్బందులను పరిష్కరించనున్న నావికాదళ బృందాలు… ఆక్సిజన్ ప్లాంట్లలో తలెత్తిన సాంకేతిక లోపాలను కూడా సవరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం చేసేందుకు అంగీకరించింది. సింగపూర్, థాయ్లాండ్, మలేషియాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్న ఆక్సిజన్తో కూడిన 25 క్రయోజనిక్ కంటైనర్స్ను తరలించేందుకు నావికాదళం అంగీకారం తెలపడం గమనార్హం.
రెగ్యులర్ అవసరాల కోసం లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కంటైనర్స్ను తరలించేందుకు ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చేందుకు నేవీ అధికారులు ఆమోద ముద్ర వేసారు. దీంతో పాటు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, డి–టైప్ ఆక్సిజన్ సిలిండర్లతో పాటు కోవిడ్ చికిత్సకు అవసరమైన ఇతర వైద్య పరికరాల సరఫరాకు అంగీకారం తెలిపారు. ఐఎన్ఎస్ కళింగ ఆసుపత్రిలో 10 ఆక్సిజన్ బెడ్స్తో పాటు 60 పడకలును కోవిడ్ చికిత్స కోసం కేటాయించేందుకు అంగీకరించారు. అదనంగా విశాఖపట్నం జిల్లా కంచరపాలెంలో 150 పడకల తాత్కాలిక ఆసుపత్రి కోసం మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. ఇందుకు అవసరమైన వైద్యులు, పారామెడికల్ స్టాప్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. 200 డి–టైప్ సిలిండర్ల అందించేందుకు ముందుకొచ్చారు.