ప్రపంచాన్ని రెండుగా విభజించిన ఇజ్రాయెల్…?
మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. తమపై దాడులకు దిగుతున్న వారిని ఏరి పారేయాలన్న కసితో అడుగులేస్తోంది ఇజ్రాయెల్. ఇటీవలే వరుసగా హెజ్ బొల్లా చీఫ్ నస్రల్లా తో పాటు పలువురు కమాండర్లను మట్టుపెట్టింది. ఇరాన్ కమాండర్లపైనా దాడులు జరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రపంచం.. కేవలం రెండింటి చుట్టూ తిరుగుతోంది. ఒకటి ఇజ్రాయెల్ అనుకూల దేశాలు.. మరొకటి ఇజ్రాయెల్ వ్యతిరేకకూటమి. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ..ఇరాన్, ఆ దేశం మద్దతు ఇస్తున్న హిజ్బుల్లా, హమాస్పై విరుచుకుపడ్డారు. అయితే, ఈ సందర్బంగా నెతన్యాహూ ప్రదర్శించిన రెండు ఫోటోలు వైరల్గా మారాయి. అందులో ఇండియా మ్యాప్ కూడా ఉంది.
నెతన్యాహూ తన కుడి చేతిలో ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్ దేశాలతో కూడా మిడిల్ ఈస్ట్ దేశాల ఫోటోలను చూపించారు. ఇవి నలుపు రంగులో ఉన్నాయి. అదే విధంగా ఎడమ చేతిలో ఈజిప్ట్, సుడాన్, సౌదీ అరేబియాతో పాటు ఇండియా మ్యాప్ కూడా ఉండటం సంచలనంగా మారింది. ఈ దేశాలు గ్రీన్ కలర్లో ఉన్నాయి. యూఎన్జీఏ వేదికగానే ఇరాన్కి నెతన్యాహూ వార్నింగ్ ఇచ్చారు. తమని రెచ్చగొడితే ఇరాన్లోని ఏ ప్రాంతంలోకైనా చేరుకోగలమని హెచ్చరించారు. ఇరాన్పై ఆంక్షలు విధించాల్సిన అవసరాన్ని చెప్పారు.
ఐక్యరాజ్యసమితిలో నెతన్యాహూ భారత్ని ‘‘బ్లెస్సింగ్(దీవెన)’’గా, ఇరాన్ని ‘‘కర్స్(శాపం)’’గా అభివర్ణించారు. ఇజ్రాయిల్ ప్రధాని తన మిత్రదేశాలను ఆశీర్వాదంగా చూపించారు. నెతన్యాహూ ప్రదర్శించిన ‘‘బ్లెస్సింగ్’’ మ్యాప్లో ఇజ్రాయిల్తో బలమైన సంబంధాల ఉన్న దేశాలను హైలెట్ చేశారు. ‘‘చాలా కాలంగా ప్రపంచం ఇరాన్ని శాంతింపచేసింది. దాని అంతర్గత అణచివేతకు కళ్లు మూసుకుంది. ఆ బుజ్జగింపు ఇప్పుడు ముగియాలి’’ అని ప్రపంచానికి సూచించారు. అయితే, నెతన్యాహూ ప్రసంగం సాగిస్తున్న సమయంలో పలు దేశాల దౌత్యవేత్తలు సభ నుంచి వాకౌట్ చేశారు. సౌదీ అరేబియాని గ్రీన్ కలర్లో సూచించడం, ఇటీవల కాలంలో ఇజ్రాయిల్-సౌదీల మధ్య బలపడిన బంధాన్ని హైలెట్ చేస్తుంది.
ఇక ఇరాన్కి సౌదీ బద్ధశత్రువు. ఈ నేపథ్యంలోనే శత్రువుకి శత్రువు మిత్రుడనే ధోరణిని ఇజ్రాయిల్ ప్రదర్శించింది. బైడెన్ పరిపాలనతో అమెరికా ఈ రెండు దేశాల మధ్య స్నేహం కుదిరేలా మధ్యవర్తిత్వం చేసింది. హమాస్, హిజ్బు్ల్లాపై ఇజ్రాయిల్ దాడుల్ని సౌదీ ఏ రోజు వ్యతిరేకించలేదు. ఇక భారత్- ఇజ్రాయిల్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇజ్రాయిల్, భారత్కి ‘‘ఆల్ వెదర్’’ ఫ్రెండ్గా ఉంది. ఇరు దేశాల ప్రజలు ఒకరపై ఒకరు అభిమానాన్ని కలిగి ఉన్నారు. టెక్నాలజీలో భారత్కి ఇజ్రాయిల్ మద్దతు ఉంది. కార్గిల్ యుద్ధంలో భారత్కి సహకరించిన విషయాన్ని ఎప్పుడూ మరిచిపోదు. ఇక ఈజిప్ట్ తో ఇజ్రాయిల్కి 1979 శాంతి ఒప్పందం కుదిరింది. ఈజిప్టు ప్రాంతీయ స్థిరత్వం ఇజ్రాయిల్ కి మద్దతు ఇస్తోంది.






