T20 ప్రపంచకప్ 2024 విజేతగా భారత్…
పొట్టిప్రపంచకప్ లో టీమిండియా జగజ్జేతగా ఆవిర్బవించింది. హేళన చేసిన జట్లకు గట్టి సమాధానం చెబుతూ తానే ప్రపంచచాంపియన్ అని రుజువు చేసుకుంది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో సఫారీలను సఫా చేసింది. పదకొండు మంది ఆటగాళ్లు స్టార్ ఆటను ప్రదర్శించడంతో ..కప్పు వచ్చి భారత్ ఒళ్లో వాలింది. ఈ ప్రదర్శనతో దేశమంతా జేజేలు పలుకుతుండగా.. భారత్ ఛాంపియన్ అని రుజువు చేసుకుందని వెటరన్స్ చెబుతున్నారు.
రోహిత్ కెప్టెన్సీ నైపుణ్యం…
ఈ ఆటలో కీలకంగా వ్యవహరించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ప్రతీ సందర్బంలోనూ ఆటగాళ్లను అద్భుతంగా వినియోగించుకున్నాడు. చేతిదాకా వచ్చిన విజయం ఎక్కడ వెనక్కు పోతుందో అన్న భయంతో అనుక్షణం ఆటపై ఫోకస్ పెట్టాడు. తాను ఆడడమే కాదు.. సహచరుల్లో స్ఫూర్తి నింపాడు రోహిత్. దీంతో విజయం తుదకంటా దోబూచులాడినా గడుసుగా దొరకబుచ్చుకుని జట్టును గెలిపించాడు రోహిత్ శర్మ. దీంతో చాంపియన్ కావాలన్న సఫారీల ఆశలు అలానే మిగిలిపోయాయి.
ఫైనల్లో కోహ్లీ అద్భుత ఆటతీరు…
టీ20 ఫార్మాట్లోనే నరాలు తెగే టెన్షన్ ఉంటుంది. కళ్లుమూసి తెరిచేలోపు ఇన్నింగ్స్ అయిపోతుంది. నిర్ణయాలు శరవేగంగా తీసుకోవాలి. ఒక చిన్న తప్పుడు వ్యూహం కూడా మ్యాచ్ను దూరం చేస్తుంది. రోహిత్-కోహ్లీ జోడీ ఫోర్లతో జోరుగానే ఇన్నింగ్స్ను ప్రారంభించింది. కానీ, రోహిత్, పంత్, సూర్య వికెట్లు వెంటవెంటనే కోల్పోవడంతో జట్టు 34/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. భారీ స్కోర్ ఆశలు ఆవిరైపోయాయి. స్కోర్ 100 దాటక ముందు జట్టు పెవిలియన్కు క్యూకట్టకుండా అడ్డుకోవాలి. ఈ దశలో కోహ్లీ ‘ప్రజెన్స్ ఆఫ్ మైండ్’ ఇక్కడ అద్భుతంగా పనిచేసింది. అనవసరమైన దూకుడును తగ్గించాడు.. మరో వికెట్ పడకుండా అక్షర్తో కలిసి సింగిల్స్, డబుల్స్తో స్కోర్ బోర్డ్ను ఎక్కడా 7 రన్రేట్ తగ్గకుండా ముందుకు నడిపించాడు. అప్పుడప్పుడు అక్షర్ దాడి చేసినా.. తాను బ్యాలెన్స్ కోల్పోలేదు. స్కోర్ బోర్డు 100 దాటాక మెల్లగా వేగం పెంచాడు. ఈ క్రమంలో అక్షర్ పెవిలియన్కు చేరినా.. దూబెతో కలిసి చకచకా పరుగులు చేశాడు. చివరికి వచ్చేసరి రన్రేట్ 8 దాటించాడు. బార్బడోస్ వంటి పిచ్లపై ఇది మంచి స్కోర్ అని చెప్పొచ్చు. ఈ వికెట్ పై సగటు 159.. కానీ, భారత్ 176 చేసింది. కోహ్లీ అనుభవంతో మ్యాచ్పై భారత్ పట్టు కొనసాగింది.
బౌలింగ్ అద్వితీయం..
దక్షిణాఫ్రికాను బ్యాటింగ్లో కట్టడి చేసే బాధ్యత బుమ్రా అండ్ కో భుజస్కందాలపై పడింది. అర్ష్దీప్, బుమ్రా అద్భుతమైన ఆరంభం ఇస్తూ.. హెండ్రిక్స్, మార్క్రమ్ను స్వల్పస్కోర్లకే పెవిలియన్కు చేర్చారు. కానీ, టీమ్ఇండియా ఆనందం కొద్దిసేపట్లోనే ఆవిరైపోయింది. స్టబ్స్, డికాక్, క్లాసెన్ నిలకడగా షాట్లు కొట్టి అవసరమైన రన్రేట్ను తగ్గించారు. చివర్లో క్లాసెన్కు తోడు కిల్లర్ మిల్లర్ నిలవడంతో 15వ ఓవర్లో అక్షర్ బౌలింగ్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్లతో 24 పరుగులు పిండారు. దీంతో అవసరమైన రన్రేట్ 6కు చేరింది. ఆరు వికెట్లు చేతిలో ఉండటంతో సఫారీల విజయం నల్లేరుపై బండి నడకే అనుకొన్నారు.
బుమ్రా, అర్ష్దీప్, హార్దిక్, జడ్డూకే ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంతి బుమ్రా చేతికి వెళ్లింది. ఫలితంగా 16వ ఓవర్లో సఫారీలకు కేవలం నాలుగు పరుగులే వచ్చాయి. ఆ తర్వాత 17వ ఓవర్ బాధ్యతను వైస్ కెప్టెన్ పాండ్యా అందుకొని.. ప్రమాదకరంగా మారిన క్లాసెన్ను తొలి బంతికే ఔట్ చేశాడు. పైగా మొత్తంగా 4 పరుగులే ఇచ్చాడు. దీంతో ఒత్తిడి సఫారీల జట్టువైపునకు షిఫ్ట్ అయింది. మళ్లీ తురుపుముక్క బుమ్రాకు బౌలింగ్ ఇచ్చాడు రోహిత్.అతడు కూడా డాట్ బాల్స్తో తన చివరి ఓవర్ ప్రారంభించాడు. యాన్సెన్పై ఒత్తిడి పెంచి.. ఓ అద్భుతమైన ఇన్స్వింగర్తో అతడి బెయిల్స్ ఎగరగొట్టాడు. ఆ ఓవర్లో సఫారీలకు వచ్చింది రెండు పరుగులే. వారు ఇంకా 12 బంతుల్లో 20 రన్స్ చేయాలి. ఈ సమయంలో అర్ష్దీప్ చేతికి బంతిని అందించాడు. కేవలం పరుగులు కట్టడి చేయడమే అతడి బాధ్యత. కొత్తగా క్రీజులోకి వచ్చిన మహారాజ్ను లక్ష్యంగా చేసుకొని సర్దార్ డాట్బాల్స్ వేశాడు. మిల్లర్ షాట్లు కొట్టేందుకు వీలు లేకుండా లోపలికి వచ్చే బంతులు విసిరాడు. ఫలితంగా 19వ ఓవర్లో దక్షిణాఫ్రికా 4 పరుగులతో సరిపెట్టుకొంది.
6 బంతుల్లో 16 పరుగులు చేయాలి. మిల్లర్ క్రీజులో ఉన్నాడు. హార్దిక్ తొలి బంతే ఊరిస్తూ లోవైడ్ ఫుల్టాస్ వేశాడు. ఈ ఉచ్చులోపడ్డ మిల్లర్ భారీషాట్కు యత్నించాడు. బౌండరీకి మిల్లీమీటర్ల దూరంలో క్యాచ్ అందుకొన్న సూర్య బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు.. దీంతో తిరిగి బంతిని గాల్లోకి ఎగరేసి బౌండరీ దాటేశాడు. బాల్ నేలను తాకేలోపే తిరిగి మైదానంలోకి దూకుతూ ఒడిసి పట్టేశాడు. ఈ రిలే క్యాచ్తో మ్యాచ్ ఒక్కసారిగా భారత్ పక్షానికి మళ్లింది. ఆ బాల్కు తర్వాత ఒక ఫోర్ ఇచ్చినా.. ఐదో బంతిని ఆఫ్స్టంప్ బయటకు విసిరాడు. భారీ షాట్కు యత్నించిన రబాడ సూర్యకు క్యాచ్ ఇవ్వడంతో భారత్ విజయం ఖాయమైంది. మ్యాచ్లో ఎక్కడా భారత్ ఒత్తిడిని బయటకు కనిపించనీయలేదు. చివరి వరకు పోరాడుదామానే తెగింపును ప్రదర్శించింది. టీమిండియా జయభేరితో దేశం ఆనందంలో మునిగిపోయింది. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, విపక్షనేత రాహుల్ సహా పలువురు నేతలు, వీఐపీలు జట్టు ఆటతీరుపై ప్రశంసలు కురిపించారు.






