Srihari Kota: నయాసాల్.. ఇస్రో నయా ఎక్స్ పెరిమెంట్స్..!
కొత్త సంవత్సరంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ -ఇస్రో.. సరికొత్త ప్రయోగాలకు సిద్ధమవుతోంది.దీనిలో భాగంగా… ఈ నెల 12వ తేదీన ఉదయం 10:17 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ను ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగం ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS-N1)తో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.
ఈ మిషన్లో ప్రధాన ఉపగ్రహమైన EOS-N1కు ‘అన్వేష’ అని కూడా పేరు పెట్టారు. వ్యవసాయం, పట్టణ ప్రణాళిక, పర్యావరణ పర్యవేక్షణ వంటి కీలక రంగాలలో దేశ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. “రాకెట్, ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. ప్రయోగానికి ముందు జరగాల్సిన తనిఖీలు కొనసాగుతున్నాయి” అని ఇస్రో ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ ప్రయోగంలో స్పెయిన్కు చెందిన ఒక స్టార్టప్ అభివృద్ధి చేసిన ‘కెస్ట్రెల్ ఇనీషియల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్’ (KID) అనే ఒక చిన్న రీ-ఎంట్రీ వాహనాన్ని కూడా పరీక్షిస్తున్నారు. అన్ని ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన తర్వాత ఇది భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోనుంది.
పీఎస్ఎల్వీ రాకెట్కు ఇది 64వ ప్రయోగం కాగా, రెండు స్ట్రాప్-ఆన్ మోటార్లు కలిగిన పీఎస్ఎల్వీ-డీఎల్ వేరియంట్తో ఇది ఐదో ప్రయోగం. చంద్రయాన్-1, మార్స్ ఆర్బిటర్ మిషన్, ఆదిత్య-ఎల్1 వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రయోగాలను పీఎస్ఎల్వీ విజయవంతంగా పూర్తి చేసింది.






