ఎయిరిండియా బిగ్ డీల్.. విమానయాన చరిత్రలో
విమానయాన చరిత్రలో అతిపెద్ద కొనుగోలు ఒప్పందం జరిగింది. ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎయిర్బస్ నుంచి పెద్ద సంఖ్యలో విమానాలు కొనుగోలుకు టాటాలకు చెందిన ఎయిరిండియా ఆర్డర్ పెట్టింది. 40 వైడ్ బాడీ విమానాలు సహా మొత్తం 250 విమానాలను ఎయిర్బస్ నుంచి కొనుగోలు చేయనున్నట్లు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. ఈ మేరకు ఎయిర్బస్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన వర్చువల్గా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్, రతన్ టాటా, చంద్రశేఖరన్, కేంద్ర మంత్రులు పీయూశ్ గోయల్, జ్యోతిరాధిత్య సింథియా, ఎయిర్బస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
250 విమానాల్లో 40 వైడ్ బాడీ కలిగిన ఏ350 విమానాలను, మిగిలిన 210 నారో బాడీ విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు. వైడ్ బాడీ విమానాలను 16 గంటలకు పైగా ప్రయాణాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వరంగానికి చెందిన ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా సన్స్ మొత్తం 470 విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 250 విమానాలను ఎయిర్బస్కు తాజాగా ఆర్డర్ పెట్టింది. మిగిలిన విమానాలను బోయింగ్ నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంది. 17 ఏళ్ల తర్వాత ఎయిరిండియా చేపట్టిన తొలి ఆర్డర్ కూడా కాగా, ఎయిరిండియాను చేజిక్కించుకున్న టాటా గ్రూప్ చేపట్టిన తొలి ఆర్డర్ కూడా ఇదే కావడం గమనార్హం. 1 7 ఏళ్ల క్రితం బోయింగ్ నుంచి 68, ఎయిర్ బస్ నుంచి 43 విమానాలను ఎయిరిండియా కొనుగోలు చేసింది.






