Taiwan: ఇగ్వానా పేరు చెబితే వణుకుతున్న తైవాన్..
ద్వీపదేశం తైవాన్(Taiwan).. ఓ చిన్న జీవి పేరు చెబితే వణుకుతోంది. డ్రాగన్ కంట్రీని సైతం ఎదిరిస్తున్న తైవాన్.. ఆజంతువు పేరు చెబితే చాలు ఆగమాగం అవుతోంది. అంత చిన్న జీవి.. ఆదేశాన్ని ఎలా వణికిస్తోంది. ఎందుకా జీవిపై యుద్ధాన్ని ప్రకటించింది. ఆఖరుకు వాటిని లేకుండా చేయాలని ఎందుకు ప్రయత్నిస్తోంది..?
తైవాన్ చాలా చిన్న, పర్యాటకులను ఆకర్షించే దేశం. ఇక్కడ వ్యవసాయంతోపాటు చేపల వేట ప్రధాన వృత్తులు. ఇక పర్యాటకంగా కూడా తైవాన్ అందాలు ఆకట్టుకుంటాయి. అందుకే ఏటా వందల మంది పర్యాటకులు వస్తారు. ఇదిలా ఉంటే.. తైవాన్లో రైతులు ప్రస్తుతం సమస్య ఎదుర్కొంటున్నారు. తైవాన్లోని ఇగ్వానా అనే జీవులు దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 1.20 లక్షల ఇగ్వానాలను చంపాలని చూస్తోంది. సాంకేతిక విధానంలో కాకుండా అతి దారుణ పద్ధతుల్లో వీటిని అంతం చేయాలని ఆలోచన చేస్తోంది.
ద్వీప దేశమైన తైవాన్లో 2 లక్షలకుపైగా ఇగ్వానాలు ఉన్నాయి. ఆకుపచ్చ రంగులో ఉండే ఇగ్వానాలు బల్లుల జాతికి సంబంధించిన సరీసృపాలు. ఇవి ఆకుల నుంచి ఆహారం తీసుకుంటాయి. ఇందుకోసం గుంపులుగా పంట పొలాల్లో చొరబడి నాశనం చేస్తుంటాయి. ఇటీవల వీటి బెడద ఎక్కువైంది. దీంతో మొదటి విడతలో సుమారు 70 వేల ఇగ్వానాలను చంపేసింది. ఇందుకు ఒక్కో జీవికి 15 డాలర్లు చెల్లించింది. అయినా ఏడాదిలో వాటి సంఖ్య రెట్టింపయింది. ఇవి ఎక్కువగా అటవీ ప్రాంతంలోనే జీవిస్తాయి. గ్రామ శివారులో ఉంటాయి. వీటి గూళ్లను గుర్తించడంలో సహకరించాలని స్థానికులను ప్రభుత్వం కోరుతోంది. ఈటలు, విషపు గుళికలు, బాణాలతో చంపేలా మార్గదర్శకాలు జారీ చేసే యోచనలో ఉంది. సాధారణంగా బల్లులు క్రిములు, కీటకాలను తింటాయి. అయితే అదే జాతికి చెందిన ఇగ్వానాలు మాత్రం శాఖాహారులు. ఎక్కువ ఆకులు, పండ్లు, చిన్నపాటి మొక్కలు తింటాయి.
ఇగ్వానాలు 2 అడుగుల వరకు పెరుగుతాయి. బరువు 5 కిలోల వరకు ఉంటాయి. 20 ఏళ్ల వరకు జీవిస్తాయి. మొన్నటివరకూ వాటిని పెంచుకునేందుకు ప్రయత్నించేవారు ఎప్పుడైతే పంటలను దెబ్బతీయడం మొదలుపెట్టాయో.. ఇప్పుడు వాటిని చంపాలని చూస్తోంది తైవాన్ సర్కార్.






