NASA : నాసా ఐఎస్ఎస్ మిషన్కు ఎంపికైన మరో భారత సంతతి వ్యోమగామి

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ (Anil Menon ) ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) యాత్రకు ఎంపికయ్యారు. 2026 జూన్లో నాసా చేపట్టనున్న మిషన్లో భాగంగా అనిల్ మీనన్ రోస్కోస్మోస్ సోయజ్ ఎంఎస్-29 అనే అంతరిక్ష నౌకలో ఫ్లైట్ ఇంజనీర్గా, ఎక్స్పెడిషన్ 75 సభ్యుడిగా ఐఎస్ఎస్ కు వెళ్లనున్నారు. మీనన్ను వచ్చే ఏడాది తన మొదటి మిషన్ కోసం ఐఎస్ఎస్ కు పంపుతున్నామని నాసా తెలిపింది. మీనన్తోపాటు రష్యాకు చెందిన ప్యోటర్ డుబ్రోవ్, అనా కికినా కూడా రోస్కోస్మోస్ సోయజ్ ఎంఎస్-29లో ప్రయాణించనున్నారని పేర్కొంది.
ఈ ముగ్గురూ దాదాపు ఎనిమిది నెలలపాటు ఐఎస్ఎస్ లో శాస్త్రీయ పరిశోధనలు చేపట్టనున్నారు. ఈ ప్రయోగం కజకిస్థాన్ (Kazakhstan) నుంచి చేపట్టనున్నారు. అమెరికాలో స్థిరపడిన భారత్-ఉక్రెయిన్కు చెందిన శంకరన్ మీనన్ (Sankaran Menon) , లీసా సమోలెంకో దంపతులకు అనిల్ మీనన్ జన్మించారు. హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University) నుంచి న్యూరోబయాలజీ డిగ్రీ సాధించారు. మసాచుసెట్స్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎమర్జెన్సీ మెడిసిన్, ఏరోస్పేస్ మెడిసిన్ పూర్తిచేశారు. 2014లో ఫ్లైట్ సర్జన్గా నాసాలో చేరిన మీనన్.. 2021లో వ్యోమగామి కార్యక్రమానికి ఎంపికయ్యారు. మూడేళ్ల కఠిన శిక్షణ అనంతరం 2024లో వ్యోమగామిగా పట్టభద్రుడయ్యారు. స్పేస్ ఎక్స్లో పనిచేసే అనా మీనన్ను ఆయన వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో సునీతా విలియమ్స్ తర్వాత ఐఎస్ఎస్ లో అడుగుప్టెనున్న మరో ఇండో-అమెరికన్ వ్యోమగామిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు.