US: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్… భారీగా పడిపోయిన భారత ఎగుమతులు..!

భారతీయ ఎగుమతులపై ఏకంగా 50శాతం టారిఫ్ పడడం.. పెను సంక్షోభానికి దారితీసింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే అమెరికాకు మన ఎగుమతులు 37.5 శాతం మేర కుప్పకూలాయి. ఈ ఆందోళనకర విషయాన్ని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (GTRI) తన తాజా నివేదికలో వెల్లడించింది.
జీటీఆర్ఐ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మే 2025 నుంచి సెప్టెంబర్ 2025 మధ్య కాలంలో అమెరికాకు భారత ఎగుమతులు తీవ్రంగా పడిపోయాయి. మే నెలలో 8.8 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు, సెప్టెంబర్ నాటికి 5.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంటే, ఈ నాలుగు నెలల్లోనే నెలవారీ ఎగుమతుల విలువలో భారత్ ఏకంగా 3.3 బిలియన్ డాలర్లను కోల్పోయింది. వరుసగా నాలుగు నెలల పాటు ఎగుమతులు క్షీణించడం ఇదే తొలిసారి.
అమెరికా విధించిన 50 శాతం సుంకాలు పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత, సెప్టెంబర్ నెలలో అత్యంత తీవ్రమైన ప్రభావం కనిపించింది. ఆగస్టులో 6.87 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు, సెప్టెంబర్లో ఏకంగా 20.3 శాతం తగ్గి 5.5 బిలియన్ డాలర్లకు చేరాయి. 2025లో ఒకే నెలలో ఇంతటి భారీ పతనం నమోదు కావడం ఇదే మొదటిసారి అని నివేదిక స్పష్టం చేసింది.
ఈ సుంకాల ప్రభావం ముఖ్యంగా టెక్స్టైల్, జెమ్స్ అండ్ జువెలరీ, ఇంజినీరింగ్ వస్తువులు, రసాయనాల వంటి కీలక రంగాలపై పడింది. ఈ రంగాల నుంచి ఎగుమతులు భారీగా పడిపోవడంతో మొత్తం ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, అమెరికా వంటి అతిపెద్ద మార్కెట్లో భారత తయారీ, ఎగుమతి రంగాల పోటీతత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాషింగ్టన్ విధించిన సుంకాలే ఈ పతనానికి ప్రత్యక్ష కారణమని స్పష్టం చేసిన జీటీఆర్ఐ, భారత వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకోవడానికి తక్షణమే విధానపరమైన సమీక్ష చేపట్టాలని సూచించింది.