రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 99 స్థానాలు గెలుస్తాం : మంత్రి కేటీఆర్
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నానక్రామ్గూడలో క్రెడాయ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తొమ్మిదేళ్లలో చూసింది ట్రైలర్ మాత్రమేనని, కేసీఆర్ మదిలో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణది సమగ్ర, సమీకృత, సమతుల్య అభివృద్ధి అని అన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా సులభమే అయితే, గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లో ఎంతో మంది కూల్చేయాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు. మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారం చేపడుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధి చూసి సూపర్స్టార్ రజనీకాంత్ మెచ్చుకున్నారు. నగరవాసులంతా హైదరాబాద్ను చూసి గర్వపడే విధంగా రూపుదిద్దుకుంది. నాయకుడిని దృఢ సంకల్పం ఉండి, ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉంటే మార్పు కచ్చితంగా వస్తుందన్నారు.
మోదీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం అంటే ఇష్టం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పథకాన్ని కేంద్రం కాపీ కొడుతోంది. గతంలో ఉన్న నాయకుల మాదిరిగా కాకుండా సీఎం కేసీఆర్ పలెల్లు, పట్టణాలు రెండిరటి అభివృద్ధి చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసమే అప్పు చేస్తున్నాం. శక్తికి మించి అప్పు చేసినా ఇచ్చే వాళ్లు లేరు అని అన్నారు. హైదరాబాద్కు 250 కి.మీ. మేర పరిధిలో మెట్రో ఉండాలని కేసీఆర్ అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రం మొత్తం ఎలక్ట్రిక్ బస్లను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. నగరంలో నాలా వ్యవస్థపై వేల కోట్లు ఖర్చు పెట్టామని, సెప్టెంబరు చివరి నాటికి వంద శాతం సీవరేజ్ ట్రీట్మెంట్ పూర్తి చేసుకున్న నగరాల్లో తెలంగాణ పేరు తెచ్చుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీని అభివృద్ధి చేస్తామని తెలిపారు.