కేంద్రం కీలక నిర్ణయం... వివాదాస్పద బిల్లులో కీలక మార్పు!
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఎన్నికల కమిషనర్ల (ఈసీ )నియామకాలకు సంబంధించి తీసుకొచ్చిన బిల్లు లో కేంద్రం కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల హోదా ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విపక్షాలు, మాజీ సీఈసీల నుంచి వచ్చిన ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈసీల నియామకాలకు సంబంధించి కేంద్రం ఇటీవల ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక షరతులు, పదవీకాలం బిల్లు 2023ను ఈ ఏడాది ఆగస్టులో రాజ్యసభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ఎన్నికల కమిషనర్ల హోదాలో మార్పులు చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా సీఈసీ, ఈసీల హోదా ఉండగా, ప్రతిపాదిత బిల్లులో దాన్ని మార్చింది. వీరికి కేబినెట్ సెక్రటరీలతో సమానమైన హోదా ను ఇస్తామని బిల్లులో పేర్కొంది.